Sun Feb 01 2026 23:30:59 GMT+0000 (Coordinated Universal Time)
పెను విషాదం.. కాల్వలో దూకి కుటుంబం సామూహిక ఆత్మహత్య
ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ.. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో శంకర్, తనభార్య, ఐదుగురు పిల్లలితో..

రాజస్థాన్ లోని జలోర్ జిల్లా సంచోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెనువిషాద ఘటన జరిగింది. నేడు వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది. దంపతులు సహా.. ఐదుగురు పిల్లలతో కాలువలో దూకి సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్లోని జలోర్ జిల్లా సంచోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివశిస్తున్న శంకర్ లాల్, బద్లి దంపతులు, వీరికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల కాలంలో వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మార్చి 1వతేదీన కూడా దంపతుల మధ్య గొడవ జరిగింది.
ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ.. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో శంకర్, తనభార్య, ఐదుగురు పిల్లలితో కలిసి సమీపంలోని నర్మద కాలువలోకి దూకి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాలువలో ఈతగాళ్లతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు మృతదేహాలను నిన్న సాయంత్రానికి బయటకు తీశారు. ఆత్మహత్యల విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

