Wed Mar 18 2026 20:19:32 GMT+0530 (India Standard Time)
Mutton curry: మటన్ కోసం.. పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు
ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలో బీజేపీ భదోహి ఎంపీ వినోద్

ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలో బీజేపీ భదోహి ఎంపీ వినోద్ బింద్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విందు మటన్ కారణంగా రసాభాసగా మారింది. మజ్హవాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన కమ్యూనిటీ సమావేశంలో భాగమైన ఈ కార్యక్రమానికి సమీపంలోని గ్రామాల నుండి దాదాపు 250 మంది హాజరయ్యారు.
అతిథులు భోజనాన్ని తింటున్నప్పుడు ఎంపీ డ్రైవర్ సోదరుడు ఒక వ్యక్తికి మటన్ ముక్కలకు బదులుగా గ్రేవీని మాత్రమే వడ్డించడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వడ్డించడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, దూషించే పదజాలంతో మటన్ ముక్కలను డిమాండ్ చేశాడు. అయితే, ఆహారం అందిస్తున్న వ్యక్తి మర్యాదపూర్వకంగా మాట్లాడాలని యువకుడికి సలహా ఇచ్చాడు. అయినా అతడు తగ్గకపోవడంతో చెంపదెబ్బ కొట్టాడు.
ఈ ఘటన ఘర్షణకు దారితీసింది. గందరగోళం నెలకొంది. ఇరువర్గాలు ఘర్షణ పడడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ గొడవలో పక్క గ్రామానికి చెందిన కొందరు మద్యం మత్తులో ఉన్నారని అధికారులు తెలిపారు. దాదాపు 250 మంది ఈ సమావేశానికి హాజరయ్యారని, వారి భోజనాన్ని ఆస్వాదించారని, పరిస్థితి సద్దుమణిగిన తర్వాత శాంతియుతంగా వెళ్లిపోయారని నిర్వాహకులు స్పష్టం చేశారు.
Next Story

