Sat Jul 27 2024 01:25:38 GMT+0000 (Coordinated Universal Time)
లోన్ యాప్ వేధింపులకు మరో ఇంజినీరింగ్ విద్యార్థి బలి
తీసుకున్న సొమ్ము చెల్లించకుంటే ప్రైవేటు ఫోటోలను బయటపెడతామని బెదిరించారు. లోన్ యాప్ ఏజెంట్ల బెదిరింపులు రోజురోజుకూ..
![b tech student tejas suicide b tech student tejas suicide](https://www.telugupost.com/h-upload/2023/07/13/1520768-tejas.webp)
లోన్ యాప్ వేధింపులకు బలయ్యే యువత సంఖ్య ఆగడం లేదు. పోలీసులు చర్యలు తీసుకుంటున్నా.. ఇంకా లోన్ యాప్ ఏజెంట్ల ఆగడాలకు అంతు లేకుండా పోయింది. తీసుకున్న లోన్ కు అంతకు అంతా వడ్డీతో సహా చెల్లించినా.. ఇంకా చెల్లించాలంటూ వేధిస్తున్నారు. పెరుగుతున్న వేధింపులు తట్టుకోలేక ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల తేజస్ ఓ చైనా లోన్ యాప్ ద్వారా కొంతమొత్తం రుణం తీసుకున్నాడు. తిరిగి చెల్లించే విషయంలో విఫలం కావడంతో యాప్ ఏజెంట్లు వేధింపులకు దిగారు.
తీసుకున్న సొమ్ము చెల్లించకుంటే ప్రైవేటు ఫోటోలను బయటపెడతామని బెదిరించారు. లోన్ యాప్ ఏజెంట్ల బెదిరింపులు రోజురోజుకూ పెరుగుతుండటంతో.. తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన తేజస్.. జలహళ్లిలోని తన ఇంట్లో మంగళవారం (జులై 11) ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. తేజస్ యలహంకలోని నిట్టె మీనాక్షి కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు.‘స్లైస్ అండ్ కిస్’ అనే చైనా యాప్ నుంచి తేజస్ కొంత మొత్తం రుణం తీసుకున్నట్టు తల్లిదండ్రులు తెలిపారు. విషయం తెలుసుకున్న తేజస్ తండ్రి గోపీనాథ్ ఆ డబ్బులను విడతల వారీగా చెల్లిస్తానని భయపడొద్దని కూడా చెప్పారు.
తేజ ఆత్మహత్యకు మూడు రోజుల ముందు రుణ చెల్లింపుకు మరికొంత సమయం కావాలని ఏజెంట్లను గోపీనాథ్ అభ్యర్థించినా వారు ససేమిరా అనడమే కాకుండా.. ఏజెంట్లు ఇంటికి వెళ్లి మరీ బెదిరించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం యాప్ ఏజెంట్లు తేజస్ కు పలుమార్లు లోన్ కట్టాలంటూ ఫోన్లు చేశారు. దీంతో తేజస్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతను రాసిన సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనకు మరోమార్గం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నానని, తనను క్షమించాలని ఆ లేఖలో వేడుకున్నాడు. తేజస్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story