Sun May 05 2024 03:34:23 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభుత్వ హాస్టల్ లో విద్యార్థి అనుమానాస్పద మృతి
అఖిల్ మృతిపై హాస్టల్ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారమివ్వగా.. ఘటనా ప్రాంతానికి చేరుకున్న తల్లిదండ్రుల..
ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలో నాల్గవ తరగతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పులిరామన్నగూడెం గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహంలో ఉంటూ.. స్థానిక పాఠశాలలో నాల్గవ తరగతి చదువుతున్న గోగుల అఖిల్ (9) సోమవారం అర్థరాత్రి అనుమానాస్పద రీతిలో మరణించాడు. గుర్తుతెలియని వ్యక్తులు అఖిల్ ను హత్య చేశారని తెలుస్తోంది. అఖిల్ మృతిపై హాస్టల్ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారమివ్వగా.. ఘటనా ప్రాంతానికి చేరుకున్న తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని ఆధారాలు సేకరించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అఖిల్ ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది ? అర్థరాత్రి సమయంలో అఖిల్ హాస్టల్ నుంచి బయటికి ఎందుకు వచ్చాడు ? తదితర వివరాలపై పోలీసులు.. హాస్టల్ విద్యార్థులు, సిబ్బందిని ఆరా తీస్తున్నారు. కాగా.. అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు అఖిల్ ను తీసుకు వెళ్లారని తోటి విద్యార్థులు చెబుతున్నారు. తామంతా ఉదయం లేచి చూసేసరికి హాస్టల్ ఆవరణలో విగతజీవిగా కనిపించాడని పేర్కొన్నారు. అఖిల్ ను బయటకు తీసుకెళ్లిన వ్యక్తులు ఎవరన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story