Sun May 12 2024 00:05:20 GMT+0000 (Coordinated Universal Time)
బాంబు పేలి ఏడుగురికి గాయాలు
గుర్తు తెలియని వ్యక్తులు బాంబును ప్లాస్టిక్ సంచిలో పెట్టి లుటన్ రజక్ అనే వ్యక్తి ఇంటి పెరట్లో ఉంచారు. అక్కడ బాంబు ఉందని..
బీహార్ : బాంబు పేలి ఏడుగురికి గాయాలైన ఘటన బీహార్ రాష్ట్రంలోని లఖిసరాయ్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగింది. ఈ ఘటనను లఖిసరాయ్ ఎస్పీ సుశీల్ కుమార్ ధృవీకరించారు. పిపారియా పీఎస్ పరిధిలోని వాలిపూర్ వాలిపూర్ గ్రామంలో ఉదయం 7 గంటల సమయంలో బాంబు పేలిందని ఆయన తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు బాంబును ప్లాస్టిక్ సంచిలో పెట్టి లుటన్ రజక్ అనే వ్యక్తి ఇంటి పెరట్లో ఉంచారు. అక్కడ బాంబు ఉందని తెలియక.. ఆ కుటుంబానికి చెందిన వారు పెరట్లోకి వెళ్లారు.
వారిలో ఓ బాలుడు బ్యాగ్ ను తెరిచి చూడగా.. బాంబు పేలి, ఏడుగురు గాయపడినట్లు సుశీల్ కుమార్ తెలిపారు. కాగా..బాంబు తీవ్రత తక్కువగా ఉండటంతో ఏడుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని పిపారియాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విచారణ సమయంలో మరో మూడు బాంబులను కనుగొన్నట్లు ఎస్పీ తెలిపారు. బాంబులను అక్కడికి ఎవరు తీసుకొచ్చారన్న దానిపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
Next Story