Fri Dec 05 2025 14:57:44 GMT+0000 (Coordinated Universal Time)
కాకినాడలో ఘోర అగ్నిప్రమాదం.. ఏడుగురి మృతి
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను..

కాకినాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్దాపురం మండలం జి.రాఘంపేట అంబటి ఆయిల్స్ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృత్యువాతపడ్డారు. ఈ రోజు ఉదయం పరిశ్రమలో ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆయిల్ కంపెనీలో ట్యాంకర్ను కార్మికులు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటారు. ఈ క్రమంలో రెండు రోజులుగా ట్యాంకర్లో ఆయిల్ మొత్తం తీసివేశారు. దీంతో ఏడుగురు కార్మికులు అందులో దిగి ట్యాంకర్ను శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా ఘాటైన వాయువులు వెలువడటంతో కార్మికులకు ఊపిరి అందలేదు. వెంటనే బయటికొచ్చేందుకు ప్రయత్నించగా.. ఫలించక ఊపిరాడక మరణించారు.
Next Story

