Sun Feb 01 2026 15:57:11 GMT+0000 (Coordinated Universal Time)
దువ్వాడ రైల్వే స్టేషన్ ఘటన : చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి
వెంటనే స్పందించిన సిబ్బంది.. విద్యార్థినిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. వీలుకాకపోవడంతో ఆ ప్రాంతంలో ప్లాట్ ఫారమ్ ను..

విశాఖపట్నంలోని దువ్వాడ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫారమ్ - రైలుకి మధ్య ఇరుక్కుని ఓ విద్యార్థిని రెండుగంటల పాటు నరకయాతన అనుభవించింది. ఆ విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. స్లో గా వెళ్తున్న రైలు నుండి దిగుతా శశికళ అనే విద్యార్థిని జారిపడి రైలు-ప్లాట్ ఫాం మధ్య చిక్కుకుంది. ఆమెను బయటికి తీసేందుకు ప్రయాణికులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ.. సాధ్యంకాకపోవడంతో రైల్వే సిబ్బందికి సమాచారమిచ్చారు. ఇదంతా ఒకరు వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరలైంది.
వెంటనే స్పందించిన సిబ్బంది.. విద్యార్థినిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. వీలుకాకపోవడంతో ఆ ప్రాంతంలో ప్లాట్ ఫారమ్ ను పగలగొట్టి రెండుగంటల పాటు కష్టపడి ఆమెను బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందించారు. కానీ.. విద్యార్థిని నడుము భాగంలో తీవ్రంగా ఒత్తుకుపోవడంతో అంతర్గత రక్తస్రావమై ఎంసీఏ విద్యార్థిని శశికళ కన్నుమూసింది. ఆమె స్వస్థలం అన్నవరం కాగా.. దువ్వాడలోని ఓ కాలేజీలో ఎంసీఏ చదువుతోంది. గంటల తరబడి నరకం చూసి.. చికిత్స పొందుతూ చనిపోయిన శశికళ ఆత్మకు శాంతి చేకూరాలని తోటి విద్యార్థులు, నెటిజన్లు ప్రార్థిస్తున్నారు.
Next Story

