Sat Dec 13 2025 22:33:50 GMT+0000 (Coordinated Universal Time)
Murder Case : భార్య లిద్దరూ కూడబలుక్కుని .. భర్తను హత్య చేసిందిలా?
తెలంగాణలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు భార్యలు భర్తను కలిసి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది

తెలంగాణలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు భార్యలు భర్తను కలిసి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. భర్తను అతని ఇద్దరు భార్యలు కలిసి పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. నిత్యం మద్యం తాగి వచ్చి వేధించడం వల్లనే భార్యలు ఇద్దరూ కలసి భర్తను హత్య చేశారని పోలీసులు ప్రాధమిక నివేదికలో పేర్కొన్నారు. భీమ్గల్ మండలంలోని దేవక్కపేట్లో ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... దేవక్కపేటకు చెందిన మాలవత్ మోహన్కు కవిత, సంగీత అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. వీరంతా ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. మోహన్ ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి భార్యలిద్దరినీ తీవ్రంగా వేధించేవాడు.
మద్యం తాగి...
రాత్రి కూడా ఫుల్లుగా మద్యం తాగి, ఇద్దరినీ ఒక గదిలో బంధించాడు. భర్త వేధింపులు భరించలేకపోయిన భార్యలిద్దరూ అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం సోమవారం ఉదయం రెండో భార్య సంగీత సమీపంలోని కిరాణా దుకాణం నుంచి పెట్రోల్ తీసుకు వచ్చింది. వరండాలో మద్యం మత్తులో కుర్చీలో నిద్రపోతున్న మోహన్పై ఇద్దరూ కలిసి పెట్రోల్ పోసి, పొయ్యిలోని కట్టెతో నిప్పంటించారు. ఈ ఘటనలో మోహన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సజీవ దహనమయ్యాడు. అనంతరం నిందితులిద్దరూ పరారయ్యారు. మృతుడి బంధువు మాలవత్ రవి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
నిందితుల కోసం గాలింపు...
మోహన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి మొదటి భార్య ద్వారా ముగ్గురు, రెండో భార్య ద్వారా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే భార్యలిద్దరూ కూడబలుక్కుని ఈ హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు కూడా ఆరోపించారు. వేధింపులు చేస్తుంటే వదిలేసి వేరుపడాలని హత్య చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. హత్య చేసిన తర్వాత ఇద్దరూ పరారు కావడంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన గ్రామంలో సంచలనం సృష్టించింది.
Next Story

