Mon Mar 16 2026 11:41:42 GMT+0530 (India Standard Time)
Gold Prices Today : పసిడిని ఇక కొనుగోలు చేయడం కష్టమే.. ధరలు ఇంతగా పెరగడంతో?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అంతే స్థాయిలో పెరిగాయి

బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పెరుగుతున్నాయి. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. పది గ్రాముల బంగారం ధర ఎనభై మూడు వేల రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర లక్ష నాలుగు వేల రూపాయలుగా ఉంది. కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టకముందే ధరలు ఇలా పెరుగుతుండటంతో ఇక వినియోగదారులు బంగారం, వెండి కొనుగోలు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. బోల్డెంత ధర పోసి బంగారాన్ని కొనుగోలు చేయడం అనవసరమని భావించి తమ కోర్కెలను మనసులోనే అణుచుకుంటున్నారు. ధరలు తగ్గిననప్పుడు కొనుగోలు చేయవచ్చు అన్న ధోరణి ఎక్కువ మందిలో కనిపిస్తుండటంతో ఈ ప్రభావం కొనుగోళ్లపై పడిందని వ్యాపారులు చెబుతున్నారు.
నేటి నుంచి సీజన్...
నేటి నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. మార్చి నెల వరకూ పెళ్లిళ్ల ముహూర్తాలుంటాయి. అంటే మాఘమాసం ప్రారంభం నుంచే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అసలు ఈ ఏడాది ఆరంభం జనవరి నెల మొదటి తేదీ నుంచి పరుగు అందుకున్న పసిడి ఇంక ఆగడం లేదు. తగ్గకపోవడంతో శుభకార్యాలకు బంగారం, వెండి కొనుగోలు చేయాల్సిన వారు ఇబ్బందులు పడుతున్నారు. భారతీయ సంస్కృతిలో ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా బంగారాన్ని కొనుగోలు చేయడం ఒక సంప్రదాయంగా భావిస్తారు. అందుకే ఈ సీజన్ లో మరింత డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, ధరలు తగ్గే అవకాశం లేదని మార్కెట్ నిపుణులు ముందుగానే అంచనా వేశారు.
ధరలు నేడు...
వచ్చేఏడాదికి పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు చేరుకుంటుందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడే పెట్టుబడి కోసం కొనుగోల చేసే వారు కొనేసేయాలని సూచిస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అంతే స్థాయిలో పెరిగాయి. ఉదయం ఆరుగంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెలో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 76,110 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 83,030 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,06,000 రూపాయలుగా నమోదయింది. మధ్యాహ్నానికి ధరలు మరింత పెరగవచ్చు. తగ్గవచ్చు. స్థిరంగా కొనసాగవచ్చని వ్యాపారులు చెబుతున్నారు.
Next Story

