Mon Dec 08 2025 16:44:41 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : మగువలకు తీపికబురు.. శ్రావణమాసం మొదటి రోజే ఇంతటి శుభవార్త
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొద్దిగా తగ్గుముఖం పట్టాయి.

బంగారం ధరలు ఇటీవల కాలంలో పెరుగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ తగ్గించినప్పటికీ బంగారం ధరలు కొంత మేరకు తగ్గాయి. వారం రోజుల్లో నాలుగు వేల రూపాయలు తగ్గింది. అయితే ఆ తర్వాత మళ్లీ పరుగు ప్రారంభించింది. వరసగా ప్రతి రోజూ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఆషాఢమాసం ముగియడంతో ధరలు పెరుగుతాయని అంచనాలు ఊపందుకున్నాయి. బంగారం అంటే ఇష్టపడే వారు ఎక్కువ కావడం, శ్రావణమాసంలో శుభకార్యాలు, పెళ్లిళ్లు జరగనుండటంతో పసిడి, వెండి కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. అందుకు తగ్గినట్లుగానే బంగారం ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
శ్రావణమాసం...
ఆషాఢమాసం నిన్నటితో పూర్తయింది. ఇప్పుడు శ్రావణమాసం ప్రారంభం కావడంతో ధరలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు. శ్రావణమాసంలో మహిళలు ఎక్కువగా పసిడి, వెండి కొనుగోలు చేస్తారు. శ్రావణమాసంలో బంగారం, వెండి కొనుగోలు చేయడం మంచిదని భావిస్తారు. శ్రావణమాసంలో బంగారం ఇంటికి వస్తే శుభప్రదమని అనుకోవడంతోనే కొనుగోళ్లు అధికంగా ఉంటాయి. జ్యుయలరీ దుకాణాలు కూడా అందుకు అనుగుణంగా కొత్త కొత్త డిజైన్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే బంగారం దుకాణాలు వినియోగదారులు కిటకిటలాడుతున్నాయి.
నేటి ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. శ్రావణమాసం ఆరంభం రోజే ధరలు తగ్గడంతో పసిడిప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 64,690 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 70,570 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర ప్రస్తుతం 85,400 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది. అయితే ధరలు తగ్గాయని సంబరపడవద్దని, మధ్యాహ్నానికి ధరలు పెరిగినా పెరగవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Next Story

