Tue May 20 2025 04:02:47 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections : అంచనాలకు అందని ఫలితాలు.. ఊహించని విధంగా పోలింగ్
ఆంధ్రప్రదేశ్ లోఎన్నికలు ముగిశాయి. అర్థరాత్రి పన్నెండు గంటల వరకూ పోలింగ్ జరగడంతో భారీగా పోలింగ్ నమోదయినట్లు తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలు ముగిశాయి. అయితే నిన్న అర్థరాత్రి పన్నెండు గంటల వరకూ పోలింగ్ జరగడంతో భారీగా పోలింగ్ నమోదయినట్లు తెలిసింది. అధికారిక లెక్కలు అందలేదు కానీ అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 78.36 శాతం పోలింగ్ నమోదయినట్లు తెలుస్తోంది. అన్నింటి కంటే కోనసీమ జిల్లాలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదయిందని తెలుస్తుంది. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలింగ్ నమోదయిందని చెబుతున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం పెద్దగా పెరిగింది లేకపోయినా.. ఈసారి భారీగా ఓటర్లు ముందుగానే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడంతో ఓట్లు వేయడం ఆలస్యమయిందని తెలుస్తోంది.
ఒక్కసారిగా రావడంతోనే...
ఒక్కసారిగా వచ్చిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎక్కువ సమయం పట్టడం వల్లనే ఇంత ఆలస్యమయిందని అధికారులు తెలిపారు. అర్థరాత్రి పన్నెండు గంటల దాటిన తర్వాత కూడా అనేక పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరి ఉండటం కనిపించింది. అందరినీ ఓటు హక్కు కల్పించిన తర్వాతనే ఈవీఎంలను తీసుకెళ్లి ఎన్నికల అధికారులు స్ట్రాంగ్ రూమ్ లో భద్రపర్చారు. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. అప్పటి వరకూ రాజకీయ పార్టీలు, వాటి అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూడాల్సిందే. ఎవరికి వారే గెలుపు తమదే అన్న ధీమాలో కనిపిస్తున్నారు. ఎవరి అంచనాలు వేరు వేసుకుంటున్నారు.
Next Story