Thu Mar 12 2026 14:59:13 GMT+0530 (India Standard Time)
YSRCP : వాహ్.. ఇక్కడ వైసీపీ ఇంతగా పుంజుకుందా? నమ్మలేకపోతున్నారా?
కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన రెండేళ్లకే కీలకమైన ప్రాంతంలో ప్రజల్లో అధికార పార్టీ పై కొంత అసంతృప్తి కనిపిస్తుంది

కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన రెండేళ్లకే కీలకమైన ప్రాంతంలో ప్రజల్లో అధికార పార్టీ పై కొంత అసంతృప్తి కనిపిస్తుంది. ప్రధానంగా టీడీపీ, జనసేనలకు పట్టున్న జిల్లాల్లోనే వైసీపీ పుంజుకుంటున్నట్లు కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ మేధావుల సంఘం నేత చలసాని శ్రీనివాస్ కూడా కూటమి ప్రభుత్వంపై ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలోనూ కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఇంటర్వ్యూను వైసీపీ సోషల్ మీడియా ట్రెండింగ్ లో పెట్టింది. తాను కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు గతంలో కూటమి గెలిచిన స్థానాల్లో రెండు, మూడు చోట్ల మాత్రమే బలంగా ఉందని, మిగిలిన చోట్ల బలహీనపడిందని ఆయన చెప్పడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.
సహజమే అయినా...
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీపై వ్యతిరేక రావడం సహజమే. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ వంద శాతం సంతృప్తిని ప్రజల నుంచి ఏ అధికార పార్టీ పొందలేదు. అందులోనూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను జోరుగా అమలు చేస్తున్నప్పటికీ స్థానిక నేతలు, ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తితో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెబుతున్నారు. ఇది వచ్చే ఎన్నికల్లో వైసీపీకి అడ్వాటేజీగా మారనుందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతతో పాటు వైసీపీ గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు తమను గట్టెక్కిస్తాయని నమ్ముతున్నారు. అలాగే ప్రధాన సామాజికవర్గమైన కాపుల్లో కూడా కొంత వ్యతిరేకత కనపడుతుందన్న విశ్లేషణలు కూటమి పార్టీల నేతలను కుదుపునకు గురిచేస్తున్నాయి.
జగన్ ఒకసారి జనంలోకి వస్తే ...
జగన్ ఒకసారి జనంలోకి వస్తే దాని ఇమేజ్ మరింత పెరిగే అవకాశముందన్న అంచనాలు కూడా వినపడుతున్నాయి. జగన్ పాదయాత్ర వచ్చే ఏడాది చేస్తామంటున్నారు. ఆ సమయానికి మరింత హైప్ పెరిగి వైసీపీకి అనుకూలంగా వాతావరణం మారనుందన్న అంచనాల్లో ఆ పార్టీ నేతలున్నారు. మరొకవైపు కూటమి ప్రభుత్వంహామీలు అమలు చేశామని అనుకుంటుంది కానీ, జనం చేతుల్లో డబ్బులు లేకపోవడాన్ని చాలా మంది ఉదహరిస్తున్నారు. గతంలో జగన్ ఒక క్యాలెండర్ ప్రకారం డీబీటీ పద్ధతిలో నగదు బదిలీ చేసేవారని, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదని ప్రజలు అసంతృప్తి చెందుతున్నారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.అయితే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండటంతో అప్పటికి కూటమి కుదురుకునే అవకాశాలు ఉన్నాయా? లేదా? అన్నది ఆ పార్టీ నేతల తీరుపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైతే మాత్రం కొంత అననుకూలత కనిపిస్తుందని చెబుతున్నారు. దీంతో వైసీపీ నేతల్లో ఉత్సాహం పెరిగి జనంలోకి వచ్చి వారి సమస్యలపై ఫోకస్ పెట్టారు.
Next Story

