Tue Jan 20 2026 18:32:21 GMT+0000 (Coordinated Universal Time)
ఆయన ఇంటికి వెళ్లిన వైఎస్ విజయమ్మ
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్నారు. ఆమె ఈ రోజు ఉదయం ఒంగోలులోని మాజీమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లారు. బాలినేని కుటుంబ సభ్యులతో కలసి అల్పాహారం తీసుకున్నారు. శుక్రవారం రోజు వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మను పరామర్శించేందుకు ఒంగోలు వెళ్లారు. వైవీ సుబ్బారెడ్డి కుటుంబానికి.. బాలినేని కుటుంబానికి బంధుత్వం ఉంది.
బాలినేని శ్రీనివాస్రెడ్డి ప్రస్తుతం ఒంగోలు, బాపట్ల, నెల్లూరు, తిరుపతి, వైఎస్ఆర్ జిల్లాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రాంతీయ సమన్వయకర్తగా బాధ్యతలు చూస్తున్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. ఒంగోలు నుండి ఐదుసార్లు శాసనసభ సభ్యుడుగా విజయం సాధించారు. వైఎస్ జగన్ తొలి కేబినెట్లోనూ మంత్రిగా బాలినేని శ్రీనివాస్రెడ్డి పనిచేశారు.
శుక్రవారం నాడు వైఎస్ విజయలక్ష్మికి పెద్ద ప్రమాదం తప్పింది. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఆమె కారులో ఒంగోలుకు బయల్దేరారు. మార్గమధ్యంలో సంతమాగులూరు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కారు డ్రైవర్ సడన్గా బ్రేక్ వేయడంతో వెనుక వేగంగా వస్తున్న కాన్వాయ్లోని కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్న కారు వెనుక భాగం దెబ్బతింది. అయితే ఈ ఘటనలో విజయమ్మకు, కారులో ప్రయాణిస్తున్న ఇతరులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం అదే కారులో ఆమె ఒంగోలుకు చేరుకున్నారు.
Next Story

