Thu Jan 29 2026 15:26:59 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు భయపడి వెళ్లలేదు.. ఆ ప్రచారంలో వాస్తవం లేదు
వైఎస్ విజయమ్మ మరోసారి తన కుటుంబంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించారు

వైఎస్ విజయమ్మ మరోసారి తన కుటుంబంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. మరో బహిరంగ లేఖను విడుదల చేశారు. తమ కుటుంబంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆమె ఖండించారు. ఈ ప్రచారం ఎవరికీ తగదని, తన కుమారుడు జగన్ ను రాజకీయంగా ఇబ్బందుల పాలు చేయడానికే ఇటువంటి పోస్టులు పెడుతున్నారంటూ విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నాళ్ల క్రితం కర్నూలులో జరిగిన కారు ప్రమాదం విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
మనవడి వద్దకు వెళ్లానంటూ...
ఆ ప్రచారాన్ని చూసిన తర్వాత తనకు మానసిక వేదన కలుగుతుందన్న వైఎస్ విజయమ్మ దానికి తాను సమాధానం చెప్పకపోతే ప్రజలు దానిని నిజం అనుకుని నమ్మే అవకాశముందని వైఎస్ విజయమ్మ తెలిపారు. ప్రజలకు నిజం తెలియాలనే ఈ బహిరంగ లేఖ రాస్తున్నానని తెలిపారు. ఎప్పుడో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని తన కుమారుడికి ముడిపెట్టి ప్రచారం చేయడం అత్యంత విచారకరమన్న వైఎస్ విజయమ్మ, అమెరికాలో ఉన్న తన మనవడి దగ్గరకు తాను వెళ్లానని, జగన్ కు భయపడి వెళ్లలేదని ఆమె వివరణ ఇచ్చారు. ఇకనైనా ఇలాంటి ప్రచారాలను ఆపితే బాగుంటుందని, లేకుంటే తాము సహించబబోనని హెచ్చరించారు.
Next Story

