Sat Mar 07 2026 14:59:43 GMT+0530 (India Standard Time)
వారిది బురద రాజకీయం.. జగన్ ఫైర్
వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్న అధికారుల నైతికస్థైర్యం దెబ్బతీసేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని జగన్ అన్నారు

వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్న అధికారులు, సిబ్బంది నైతికస్థైర్యం దెబ్బతీసే విధంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. కావాలని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. వారం రోజుల నుంచి విరామం లేకుండా అధికారులు, సిబ్బంది వరద సహాయక చర్యల్లో పని చేస్తున్నారన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో పాటు వారి అనుకూల మీడియా బురద జల్లే కార్యక్రమం మొదలు పెట్టిందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే వరద సమయంలోనూ అసత్య ప్రచారాలకు ఒడిగడుతున్నారని జగన్ అభిప్రాయపడ్డారు.
48 గంటల్లోగా....
వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 48 గంటలలోపు బాధితులందరికీ సాయం అందేలా చూడాలని కలెక్టర్లను జగన్ ఆదేశించారు. ప్రతి కుటుంబానికి రెండు వేల రూపాయలు, 25 కిలోల బియ్యం, కందిపప్పు, కిలో ఉల్లిగడ్డలు ఇవ్వాలని జగన్ కలెక్టర్లను ఆదేశించారు. నిధుల సమస్య లేనే లేదని, బాధితుల పట్ల మానవతా థృక్ఫథంతో వ్యవహరించాలని జగన్ అధికారులను కోరారు.
Next Story

