Thu Jan 29 2026 17:48:00 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : బీజేపీతో పొత్తుతో రాష్ట్రంలో మాఫియా చెలరేగిపోతుందని జగన్ ఫైర్
ఇన్ని నెలల పాటు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టకుండా పాలన ఏ రాష్ట్రంలోనూ నడవదని వైఎస్ జగన్ అన్నారు

ఇన్ని నెలల పాటు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టకుండా పాలన ఏ రాష్ట్రంలోనూ నడవదని వైఎస్ జగన్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ ప్రవేశపెడితే ఇచ్చిన హామీలకు కేటాయింపులు చేయాల్సి వస్తుందని వెనుకంజ వేస్తున్నారన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఇసుక, మద్యం, పేకాట క్లబ్బులతో విపరీతంగా దోచుకుంటున్నారని జగన్ ఆరోపించారు. ఐదు నెలల్లో ఒక్క హామీని కూడా అమలు చేయలేదని జగన్ అన్నారు. మైనింగ్ వ్యాపారం చేయాలంటే ఆ నియోజకవర్గంలో కప్పం కట్టాల్సిందేనని జగన్ అన్నారు. ఎమ్మెల్యేకింత, ముఖ్యమంత్రికి ఇంత అని దోచుకునే పరిస్థితికి వచ్చింనదన్నారు. దోచుకో, పంచుకో, తినుకో అన్నట్లు వ్యవహారం తయారయిందన్నారు.
ప్రజల ఆశలతో....
ప్రజల ఆశలతో చెలగాటాలాడుతూ అనుకూలమీడియాతో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చారన్నారు. ఈ ఐదు నెలల్లో సూపర్ సిక్స్ లేదని, సూపర్ సెవెన్ లేదన్నారు. వాలంటీర్లకు పది వేల జీతం అని మోసం చేస్తారన్నారు. అబద్ధాలను ప్రచారం చేసి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తారని జగన్ ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి ఏడాదికి 36 వేలు ఇస్తామని, రైతులకు పంటల కోసం ఇరవై వేల రూపాయలు ఇస్తామని నమ్మబలికే ప్రయత్నం చేస్తారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూ మాయమాటలు చెబుతూ వాటిని ఎగవేసే ప్రయత్నం చేస్తారని తెలిపారు. ప్రశ్నించిన వాళ్లను భయభ్రాంతులకు గురిచేస్తారన్నారు. వ్యవస్థలను మారుస్తున్నామంటూ నమ్మబలికే ప్రయత్నిస్తుంటారని జగన్ విమర్శించారు.
ఉచిత ఇసుక అంటూ...
మార్పు చేస్తామంటూ స్కామ్ లు చేసేది ఈ ప్రభుత్వం ఉదాహరణ అని జగన్ అన్నారు. ఉచిత ఇసుక అని లారీ ఇసుక రేటు ఇరవై వేల రూపాయల పైనే ఉందని తెలిపారు. కొన్ని నియోజకవర్గాల్లో లారీ ఇసుక అరవై వేల రూపాయలు ఉందని తెలిపారు. ఏపీలో మాఫియా రాజ్యం నడుస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో వచ్చిన ఆదాయం సున్నా అయిపోయి.. ధరలను చూస్తే గతంలో కంటే ధరలు రెండింతలు, మూడింతలు పెరిగాయని జగన్ విమర్శించారు. తమ ప్రభుత్వం 80 లక్షల టన్నులను వర్షాకాలంలో స్టాక్ యార్డులో పెడితే అందుకు సగానికిపైగా దోచుకున్నారన్నారు. బీజేపీతో పొత్తు ఉండటంతో బరితెగించారంటూ మండిపడ్డారు.
Next Story

