Tue Mar 17 2026 07:11:46 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేటి నుంచి జనం మధ్యలో జగన్
నేటి నుంచి వైసీపీ అధినేత వైఎస్ జగన్ నియోజకవర్గాలలో పర్యటించనున్నారు.

నేటి నుంచి వైసీపీ అధినేత వైఎస్ జగన్ నియోజకవర్గాలలో పర్యటించనున్నారు. తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఈరోజు నుంచి వరసగా ఎన్నికల ప్రచారం నియోజకవర్గాలలో నిర్వహిస్తున్నారు. నిన్న వైసీపీ ఎన్నికల మ్యానిఫేస్టోను విడుదల చేసిన జగన్ నేటి నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. ఇప్పటికే సిద్ధం యాత్ర పేరుతో నాలుగు చోట్ల భారీ సభలను ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత మార్చి 27 నుంచి ఏప్రిల్ 24 వరకూ ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ మేమంతా సిద్ధం పేరుతో యాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే.
వరస పర్యటనలతో...
ఈ రెండు సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు మ్యానిఫేస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు అభ్యర్థుల గెలుపు కోసం నేటి నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈరోజు నుంచి ప్రతి రోజూ మూడు నియోజకవర్గాలను పర్యటించాలన్న లక్ష్యంతో ఆయన బయలుదేరుతున్నారు. మొన్నటి వరకూ మేమంతా సిద్ధం యాత్రతో రాష్ట్రాన్ని చుట్టేసిన సీఎం జగన్.. ఇవాళ్టి నుంచి మరో ఎన్నికల యాత్రతో జనంలోకి వెళ్తున్నారు. ఉదయం పది గంటలకు తాడిపత్రిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 వెంకటగిరలో జరిగే సభలో జగన్ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు కందుకూరులో జరిగే సభలో ప్రసంగిస్తారు.
Next Story

