Fri Dec 05 2025 16:23:57 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : ఇంట గెలిచి రచ్చ గెలవాలిగా జగనూ..అ పనిచేయడం లేదే?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం ఇంట గెలవలేకపోతున్నారు

ఇంట గెలచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం ఇంట గెలవలేకపోతున్నారు. ఆయన కుటుంబసభ్యులే దూరమయ్యారు. రాజకీయాల్లో జగన్ కు ఇది చాలా ఇబ్బంది కరమైన పరిణామం. ఎందుకంటే .. కుటుంబ సభ్యుల మద్దతు లేని జగన్ ఇక జనం సపోర్టు ఎలా పొందుతారన్న ప్రశ్నకు వారి వద్ద నుంచి సమాధానం బహుశా రాకపోవచ్చు. 2019 ఎన్నికలకు ముందు వరకూ ఒక్కటిగా ఉండే వైఎస్ కుటుంబం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విడపోయారు. కారణాలు బయటకు ఏవైనా చెప్పొచ్చు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవచ్చు. కానీ సామాన్య ప్రజలకు మాత్రం వైఎస్ కుటుంబంలోని విభేదాలే బయటకు కనిపిస్తాయి.
మొన్న ఓటమికి...
గత ఎన్నికలలో వైసీపీ ఘోర ఓటమికి ఇది కూడా కారణమని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టుకుని తాను రాజకీయంగా ఎదిగి ఉండవచ్చు. కానీ 2014కు ముందు నుంచే జగన్ కు తల్లి విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల మద్దతు రాజకీయంగా పుష్కలంగా లభించేది. ఇద్దరూ అలుపెరగకుండా జగన్ విజయం కోసం పనిచేశారు.షర్మిల అయితే జగన్ జైలులో ఉన్న సమయంలో సుదీర్ఘ పాదయాత్ర చేసి సోదరుడికి అండగా నిలిచారు. విజయమ్మ కూడా రేయింబవళ్లూ జగన్ ను గెలిపించాలంటూ ఊరూ వాడ తిరిగి ప్రచారాన్ని నిర్వహించారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రాగలిగారు. వంద శాతం వీరి వల్లనే కాకపోయినా ముప్ఫయి శాతం మాత్రం వైసీపీ విజయంలో వీరిద్దరి పాత్ర ఉందన్నది ఎవరూ కాదనలేరు.
మొన్నటి ఎన్నికలకు...
అదే 2024 ఎన్నికలకు వచ్చేసరికి జగన్ కు అంతా దూరమయ్యారు. తల్లి విజయమ్మ కూడా కుమారుడికి మద్దతుగా నిలవడం లేదు. అప్పుడప్పుడూ ఇడుపులపాయకు వచ్చినప్పుడు మినహా జగన్ ను ఆమె కలవడం లేదు. జగన్ వెళ్లి ఆమెను కలసి మాట్లాడింది. దీంతో పాటు ఆస్తుల తగాదాలు ఇప్పుడు మరింత దూరాన్నిపెంచాయి. న్యాయస్థానాలను ఆశ్రయిస్తుండంతో కుటుంబ సభ్యుల రచ్చ రాజకీయంగా జగన్ కే ఎక్కువ నష్టం చేకూరుస్తుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. వైఎస్ షర్మిలకు పోయేదేమీ లేదు. ఆమె అధికారంలోకి వస్తానని ఊహించుకోవడం లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చే అవకాశం లేదు. దీంతో ఏదైనా నష్టం జరిగితే అది జగన్ కే జరుగుతుంది.
వైరుథ్యాలున్నా...
ప్రతి కుటుంబంలో రక్త సంబంధీకుల మధ్య వైరుధ్యాలు,ఆస్తి తగాదాలున్నప్పటికీ రాజకీయాల్లో మాత్రం వాటికి దూరంగా ఉండాలి. ప్రజాజీవితంలో ఉన్నప్పుడు జనం వాటిని గమనిస్తారు. సొంత తల్లిని, చెల్లిని జగన్ మోసం చేస్తే ఇక జనాన్ని ఎందుకు మోసం చేయరంటూ గత ఎన్నికల నుంచి టీడీపీ, జనసేన నేతలు పెద్దయెత్తు చేసిన విమర్శలు జనంలోకి బాగా చొచ్చుకు వెళ్లాయి. కానీ జగన్ మాత్రం పట్టించుకోలేదు. దీనికితోడు వైఎస్ వివేకాహత్య కూడా జగన్ గెలుపుకు ఆటంకంగా మారింది. ఇటు కుటుంబంలో ఎవరి మద్దతు లేకపోవడంతో పాటు పైగా విమర్శలు కూడా వారి నుంచి జోరుగా వస్తుండటం జగన్ కు రాజకీయంగా ఇబ్బందులే తప్ప భవిష్యత్ లోనూ ఇవి ఏమాత్రం సరికాదన్న కామెంట్స్ వైసీపీ నేతలే అంటుండటం విశేషం.
Next Story

