Tue May 20 2025 04:16:40 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ వార్నింగ్ అందుకోసమేనా? అలాగయితేనే వర్క్ అవుట్ అవుతుందా?
వైసీపీ అధినేత జగన్ కూడా క్యాడర్ లో భరోసా నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

వైసీపీ అధినేత జగన్ కూడా క్యాడర్ లో భరోసా నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రెడ్ బుక్.. బ్లూ బుక్ అనకపోయినా తాము అధికారంలోకి రాగానే ఎవరినీ విడిచిపెట్టబోమని పదే పదే చెబుతున్నారు. వైసీపీ నేతలను, కార్యకర్తలను అక్రమ కేసులతో వేదిస్తున్న వారిని తాను వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెబుతూ ఒకవైపు క్యాడర్ లో ధైర్యం నింపుతూ మరొక వైపు అధికారులకు కూడా హెచ్చరికలు పంపుతున్నట్లే ఉంది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ కార్యకర్తలను వేదించిన పోలీసులను అధికారులను విడిచిపెట్టబోమని అంటున్నారంటే కొంత వరకూ కట్టడి చేయడానికే అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలకు పోలీసులు, అధికారులు బలవుతున్నారు.
పాలకులు చెప్పినట్లే...
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ వారు చెప్పినట్లు పోలీసులు కాని, అధికారుల కానీ చేయాల్సి వస్తుంది. తాము చేయలేమని చేతులెత్తేసినా, నిబంధనలకు అనుగుణంగా వెళతామని చెప్పినా వెంటనే బదిలీ బహుమతి అంటుంది. అందుకే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధికారులు ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తున్నారు. కొన్ని కేసుల్లో న్యాయస్థానాల చేత చీవాట్లు కూడా తింటున్నారు. తర్వాత ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏంటన్న ఆలోచన చేయడం లేదు. ఉన్నన్నాళ్లు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసుకుని వెళితే సరిపోతుందన్న భావనలోనే అధికారులు ఉన్నారు. ఇందులో వారిని తప్పుపట్టడానికి ఏమీ లేదు. ఎందుకంటే వారు పాలకులు చెప్పినట్లు నడుచుకోవాల్సిందే.
కంట్రోల్ చేయడానికేనా?
అందుకే నాడు చంద్రబాబు, లోకేశ్ అయినా.. నేడు జగన్ అయినా అధికారులకు వార్నింగ్ ఇస్తూ కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే అటువంటి అధికారులకు సినిమా చూపిస్తామని జగన్ అంటున్నారంటే అధికారులపై చర్యలకంటే కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకేనని వేరే చెప్పాల్సిన పనిలేదు. నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసులు పెట్టాలంటూ అధికారులపై వత్తిడి తెచ్చిన విషయాన్ని జగన్ మర్చిపోతున్నారంటూ కామెంట్స్ వినపడుతున్నాయి. అప్పుడు ప్రత్యర్థులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపినప్పుడు ఆనందంగా ఉన్న జగన్ ఇప్పుడు తన వంతు వచ్చే సరికి బాధపడిపోతున్నారని, కర్మ రిటర్న్ అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్నారు.
రెండు పార్టీల మధ్య...
వైఎస్ జగన్ ఆ మాట చెప్పినా చెప్పకపోయినా ఏపీ రాజకీయాలు ఏ రాష్ట్రంలో లేనంత కక్ష సాధింపు చర్యలకు రెండు పార్టీలు దిగుతున్నాయి. ఎవరు అధికారంలో ఉన్నా ఈ పరిస్థితిలో మార్పు ఉండకపోవచ్చు. రెండు పార్టీల మధ్య నలిగిపోయేది అధికారులు మాత్రమే. జగన్ కు నచ్చిన అధికారులు చంద్రబాబుకు నచ్చరు. అలాగే చంద్రబాబు మెచ్చిన అధికారులు జగన్ ఉంచరు. ఇలా ఎన్నాళ్లని కొందరు ప్రశ్నిస్తున్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలు తీసుకోవచ్చు కానీ, అధికారులపై చర్యలకు దిగితే అన్న శాఖలకు చెందిన ఉన్నతాధికారులు అయోమయంలో పడతారు. అందుకే జగన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఇప్పట్లో ఆగవని అర్థమవుతుంది. అయినప్పటికీ అధికారులు మాత్రం అన్నింటికీ రెడీ పాలకులు చెప్పినట్లే నడుచుకోవడం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్పెషాలిటి.
Next Story