Thu Mar 19 2026 02:43:18 GMT+0530 (India Standard Time)
ఆర్థిక ఎమెర్జెన్సీని విధించాలి : యనమల డిమాండ్
జగన్ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని, రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిందని యనమల రామకృష్ణుడు అన్నారు

జగన్ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని, రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. అప్పుల్లో ఉన్న వృద్ధి స్థూల ఉత్పత్తిలో కన్పించడం లేదన్నారు. మూడున్నరేళ్లలో ప్రభుత్వం ఆదాయం సరాసరిన పదిశాతం మాత్రమే పెరిగిందని యనమల రామకృష్ణుడు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పల వృద్ధి మాత్రం 37.5 శాతానికి పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. జగన్ ప్రభుత్వం నుంచి దిగిపోయే నాటికి పది లక్షల కోట్ల అప్పు ఉంటుందని ఆయన అన్నారు.
ఆర్బిఐ లేఖ బయటపెట్టండి...
రాష్ట్ర ఆర్థిక పరిస్థిితిపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ నెల 9వ తేదీన రాసిన లేఖను బయట పెట్టాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఏడాదికి అసలు, వడ్డీ కలుపుకుని లక్ష కోట్లు చెల్లించాల్సిన ప్రమాదం ఏర్పడిందని యనమల ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల ఆస్తులు మాత్రం పెరుగుతున్నాయని, ప్రజల ఆదాయం మాత్రం తగ్గుతుందని ఆయన ఎద్దేవా చేశారు. ఆర్టికల్ 360ని అమలు చేసి రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.
Next Story

