Wed May 14 2025 05:24:25 GMT+0000 (Coordinated Universal Time)
Kesineni Nani : సన్యాసం అంత తేలిక కాదు.. కేశినేనీ.. ప్రకటన రెడీ అవుతుందటగా?
బెజవాడ పాలిటిక్స్ మళ్లీ హీటెక్కుతున్నాయి. మాజీ ఎంపీ కేశినేని నాని తిరిగి యాక్టివ్ అవుతున్నారు

బెజవాడ పాలిటిక్స్ మళ్లీ హీటెక్కుతున్నాయి. మాజీ ఎంపీ కేశినేని నాని తిరిగి యాక్టివ్ అవుతున్నారు. రాజకీయంగా ఆయన త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. తిరిగి వైసీపీలో యాక్టివ్ అవ్వాలని ఆయన యోచిస్తున్నారని సమాచారం. విజయవాడ పార్లమెంటుకు 2024, 2019 ఎన్నికల్లో గెలిచిన కేశినేని నానిని పార్టీ నాయకత్వం పక్కన పెట్టింది. ఆయన సోదరుడు కేశినేని చిన్నిని పార్టీలోకి తీసుకు వచ్చి మంచి స్థానం ఇచ్చింది. అయితే ఆగ్రహించిన కేశేనేని నాని టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లిపోయారు 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు.
తప్పుకుంటున్నానని...
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన తిరిగి రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు స్పష్టంగా కనపడుతుంది. తనకు విజయవాడ అంటే ప్రేమ అని పిచ్చి అని కేశినేని నాని గతంలో ఒక సందర్భంలో తెలిపారు. విజయవాడ అంటే ప్రేమతోనే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ సేవ చేయడానికి ముందుంటానని తెలిపారు. అయితే సేవ చేయాలంటే రాజకీయాలు అవసరమని గుర్తించిన కేశినేని నాని త్వరలోనే తిరిగి వైసీపీ జెండా పట్టుకుని తిరిగే అవకాశాలున్నాయంటున్నారు. కేశినేని నాని రాజకీయంగా రీ ఎంట్రీ ఇవ్వాలంటూ ఆయన సన్నిహితులు కూడా వత్తిడి తెస్తున్నారు. పదేళ్ల పాటు అనుభవించిన దర్పం, రాజకీయానికి దూరం కావడం ఇష్టం లేని నాని తిరిగి ఫ్యాన్ వైపు చూస్తారంటున్నారు.
బీజేపీ చేరాలనుకున్నా...
కేశినేని నాని తొలుత బీజేపీ చేరాలనుకున్నా కూటమిలో టీడీపీతో కలసి ఉండటంతో తనకు బెజవాడ టిక్కెట్ దొరకదని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. అందుకే బీజేపీ వైపు కాకుండా తిరిగి వైసీపీలోనే యాక్టివ్ కావాలని భావిస్తున్నారు. మంచి సమయం చూసుకుని ఆయన తిరిగి వైసీపీలో యాక్టివ్ అవుతారని బెజవాడలో టాక్ బలంగా వినిపిస్తుంది. కూటమి ప్రభుత్వం పై ఏడాది పాలనలో ఏర్పడిన అసంతృప్తి ఈసారి తన గెలుపునకు ఖచ్చితంగా కారణమవుతుందని భావిస్తున్నారు. తనను నమ్ముకున్న వారికి కూడా న్యాయం చేయాలంటే రాజకీయాలలో కొనసాగాలని నిర్ణయించుకున్నారని, అందుకే త్వరలోనే కేశినేని భవన్ నుంచి ఒక ప్రకటన వెలువడే అవకాశముందని తెలిసింది.
అందుకేనా విమర్శలు...
అందుకే ట్రయల్ లో భాగంగా తన సోదరుడు, ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై రోజూ ఆరోపణలు చేస్తున్నారు. నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ట్యాగ్ చేస్తూ రోజుకొక పోస్టు పెడుతున్నారు. విశాఖలో అర్సా సంస్థలకు భూముల కేటాయింపు నుంచి విమర్శలు మొదలుపెట్టిన కేశినేని నాని తాజాగా మద్యం కుంభకోణంలో కూడా చిన్ని ప్రమేయం ఉందన్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇదంతా తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వచ్చిన స్క్రిప్ట్ అంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయినా వెనక్కు తగ్గని కేశినేని నాని విజయవాడ ఎంపీపైన, తన సోదరుడినే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుండటంతో బెజవాడ ఎంపీగా పోటీ చేయడానికేనని విశ్లేషకులు కూడా అంటున్నారు. మరి ఎప్పుడు ప్రకటన వస్తుందన్నది చూడాలి. ఈ నేపథ్యంలోనే బెజవాడ పాలిటిక్స్ హీటెక్కాయి.
Next Story