Fri Dec 05 2025 14:59:12 GMT+0000 (Coordinated Universal Time)
విజయవాడ హైవేపై రెండు బస్సులు దగ్ధం..
దాంతో సూర్యాపేట నుంచి ఏపీకి చెందిన మరో బస్సును తీసుకొచ్చి.. వైర్ల సాయంతో బ్యాటరీ సమస్యను పరిష్కరించేందుకు..

విజయవాడ హైవేపై రెండు బస్సులు దగ్ధమయ్యాయి. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ అగ్నిప్రమాదం తాలూకు వివరాలిలా ఉన్నాయి. చివ్వెంల మండలం గుంపుల శివారులో హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవేపై రెండు బస్సులు మంటల్లో చిక్కుకున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన రెండు బస్సుల్లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో రెండు బస్సులూ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.
ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న "వెన్నెల" బస్సులో సాంకేతికలోపం తలెత్తింది. దాంతో బస్సు లైట్లు పనిచేయలేదు. దాంతో సూర్యాపేట నుంచి ఏపీకి చెందిన మరో బస్సును తీసుకొచ్చి.. వైర్ల సాయంతో బ్యాటరీ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో సూర్యాపేట నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సులో పెద్ద శబ్ధం వచ్చి మంటలు చెలరేగాయి. ఆ మంటలు మరో బస్సుకూ వ్యాపించి.. రెండూ దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో బస్సుల్లో ప్రయాణికులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

