Sat Jul 27 2024 01:38:31 GMT+0000 (Coordinated Universal Time)
ఆగిపోతున్న గుండెలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు యువకుల మృతి
శనివారం రాత్రి పార్డిలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. పెళ్లికుమారుని బంధువు, మిత్రుడైన మహారాష్ట్రలోని శివుని గ్రామానికి..
![youth died with heart attack youth died with heart attack](https://www.telugupost.com/h-upload/2023/02/26/1473260-youth-heart-attack.webp)
ఒకప్పుడు గుండెపోటు అంటే.. ఫలానా వయసు వారికి వస్తుందన్న అంచనా ఉండేది. కానీ ఈ రోజుల్లో అలాంటి అంచనాలేవీ లేవు. నడుస్తూ, వ్యాయామం చేస్తూ, డ్యాన్స్ చేస్తూ, పెళ్లి అవుతుందన్న ఆనందం తట్టుకోలేక ఇలా క్షణకాలంలోనే మృత్యుఒడికి చేరుతున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో మరో ఇద్దరు యువకులు గుండెపోటుతో మరణించడం కలచివేస్తోంది. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(కె) గ్రామంలో పెళ్లి రిసెప్షన్ వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ 20 ఏళ్లు కూడా లేని యువకుడు గుండెపోటుతో మరణించాడు.
పార్డి గ్రామానికి చెందిన కిష్టయ్య కుమారుని వివాహం శుక్రవారం భైంసా మండలంలోని కామోల్ గ్రామంలో జరిగింది. శనివారం రాత్రి పార్డిలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. పెళ్లికుమారుని బంధువు, మిత్రుడైన మహారాష్ట్రలోని శివుని గ్రామానికి చెందిన ముత్యం (19).. ఈ వేడుకకు హాజరయ్యాడు. అప్పటిదాకా డ్యాన్స్ చేసిన అతడు.. ఉన్నట్టుండి ఆగిపోయి.. అలానే కిందికి పడిపోయాడు. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
మరోవైపు ఏపీలోనూ మరో యువకుడు ఆకస్మిక మరణం చెందాడు. కర్నూల్ జిల్లా ఆదోనిలో జిమ్ లో వ్యాయామం చేస్తుండగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. యువకుడు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇంటివద్దే ఉంటూ.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. ఇటీవలే అతనికి పెళ్లి కూడా నిశ్చయమైంది. ఇలాంటి ఘటనే నాలుగు రోజులక్రితం తెలంగాణలోనూ జరిగింది. జిమ్ చేస్తూ పాతికేళ్ల కానిస్టేబుల్ మృతి చెందాడు.
Next Story