Thu Jan 29 2026 03:02:22 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. శ్రీవారి టోకెన్ రహిత

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనానికి 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 67,308 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి హుండీ ఆదాయం 3.82 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీవారికి 26,674 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.
హిందూ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో టీటీడీ ఆర్థిక సహాయంతో నిర్మించిన 501 ఆలయాలకు ధూపదీప నైవేద్యాల కోసం ఆగస్టు నెలకు గాను ఒక్కో ఆలయానికి రూ.5 వేలు చొప్పున 25 లక్షలా 5 వేల రూపాయలు గురువారం శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా విడుదల చేశారు.
శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 206వ వర్ధంతి ఉత్సవాలు ఆగస్టు 25వ తేదీల్లో తిరుపతి, తరిగొండలో ఘనంగా జరుగనున్నాయి. తరిగొండలో ఆగస్టు 25వ తేదీ సాయంత్రం 6 గంటలకు శ్రీలక్ష్మీనృసింహస్వామివారికి కల్యాణోత్సవం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తిరుపతిలో ఆగస్టు 25వ తేదీ ఉదయం 11 గంటలకు ఎం.ఆర్.పల్లి సర్కిల్ వద్ద ఉన్న తరిగొండ వెంగమాంబ విగ్రహానికి టీటీడీ అధికారులు పుష్పాంజలి ఘటిస్తారు. అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10 గంటలకు సంగీత సభ, ఉదయం 11.30 గంటలకు హరికథ, సాయంత్రం 6 గంటలకు ప్రముఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Next Story

