Fri Jan 30 2026 05:52:48 GMT+0000 (Coordinated Universal Time)
24 గంటలు... శ్రీవారి దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈరోజు ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా కనపడుతుంది.

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈరోజు ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా కనపడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఇరవై రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. నడకదారి వచ్చే భక్తులకు ఐదు గంటలలో శ్రీవారి దర్శనం లభిస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టోకెన్లు లేకుండా ఈరోజు ఉదయం ఏడు గంటలకు సర్వదర్శనం క్యూ లైన్లో ప్రవేశించే భక్తులకు మాత్రం శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 76,652 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. వీరిలో నిన్న తిరుమల శ్రీవారి 37,027 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.21 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

