Thu Mar 26 2026 17:49:10 GMT+0530 (India Standard Time)
Weather Report : వేడి గాలులు మొదలు.. పగటి వేళ ఉష్ణోగ్రతలు పెరిగాయ్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. చలి తీవ్రత తగ్గింది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. క్రమంగా వేడి వాతావరణం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కురిసే అవకాశముందని చెప్పింది. రానున్న కాలంలో మరింతగా వేడి గాలుల ఉధృతి కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
గరిష్టంగానే ఉష్ణోగ్రతలు...
ఆంధ్రప్రదేశ్ లోనూ వేడి గాలులు మొదలయ్యాయి. పగటి పూట కొంత ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తీర ప్రాంతాల్లో ఉక్కపోత వాతావరణం నెలకొంది. రాయలసీమలో, ఉత్తరాంధ్రలో గరిష్ట ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పింది. ఇప్పటికే పల్నాడు, కృష్ణా, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో 30 నుంచి 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
చలితీవ్రత తగ్గినా...
తెలంగాణలోనూ చలితీవ్రత తగ్గింది. నిన్న మొన్నటి వరకూ ఫ్యాన్ కూడా వేయని ప్రజలు ఇప్పుడు ఫ్యాన్ లేనిదే ఉండలేకపోతున్నారు. ఉదయం పది గంటల నుంచి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం కూడా పెరిగిందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో పొడి వాతావరణం ఉన్నప్పటికీ ఉదయం, తెల్లవారు జామున మాత్రం చలిగాలులు కొంత వీస్తున్నాయని పేర్కొంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని పేర్కొంది. ఈ సారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది.
Next Story

