Sun Feb 01 2026 16:47:19 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చాలా రోజుల తర్వాత కుప్పంకు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా రోజుల తర్వాత కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా రోజుల తర్వాత కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నెలలో మూడు రోజుల పాటు కుప్పంలోనే పర్యటించనున్నారు. చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన జరిపి దాదాపు ఏడాది కావస్తుంది. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా 52 రోజుల పాటు జైలులో ఉన్న తర్వాత తొలి సారి ఆయన తుపాను ప్రభావితం ప్రాంతాల్లో గుంటూరు, ప్రకాశం జిల్లాలో పర్యటించారు. తర్వాత ఇటీవల నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు విశాఖలో పర్యటించారు.
పార్టీ నేతలు, కార్యకర్తలతో...
ఇప్పటి వరకూ తన సొంత నియోజకవర్గమైన కుప్పం నియోజకవర్గానికి ఆయన వెళ్లేలేదు. అయితే లోకేష్ యువగళం పాదయాత్ర కుప్పం నుంచే ప్రారంభమయింది. అలాగే చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు ఆయన సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో పర్యటించారు. చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా మరణించిన కుటుంబాలను పరామర్శించారు. అయితే చాలా రోజుల తర్వాత చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తుండటంతో పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 28వ తేదీన కుప్పం నియోజకవర్గానికి వెళ్లి 29,30 తేదీల్లో నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు.
Next Story

