Sat Jul 27 2024 01:21:24 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఎన్డీఏ కూటమి శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఎన్డీఏ కూటమి నేతలు తమ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు
![Andhra Pradesh : ఎన్డీఏ కూటమి శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక Andhra Pradesh : ఎన్డీఏ కూటమి శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక](https://www.telugupost.com/h-upload/2024/06/11/1629760-nda.webp)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఎన్డీఏ కూటమి నేతలు తమ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన సమావేశానికి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు హాజరయ్యారు. 164 మంది శాసనసభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ శాసనసభ పక్ష నేతగా ప్రతిపాదించగా ఏకగ్రీవంగా అందరూ ఆమోదించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ను చీలనివ్వని చెప్పి, తగ్గి నెగ్గామన్నారు. ప్రజలకు చాలా మాటలు ఇచ్చామన్నారు. ఇది కక్ష సాధింపు చర్యలకు సమయం కాదని, వ్యక్తిగత దూషణలకు టైం కాదని, ఐదుకోట్ల మంది ప్రజలు నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆంధ్రప్రదేశ్ ను అన్ని రాష్ట్రాల్లో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు.
సుదీర్ఘ అనుభవం...
సవాళ్లను సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా చంద్రబాబు దీనిని అధిగమిస్తారని భావిస్తున్నానని తెలిపారు. ఆయన అనుభవం ఏపీ ప్రజలకు ఉపయోగపడాలని కోరుకుంటున్నానని అన్నారు. అందుకే ఆయన పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు పేరును ప్రతిపాదిస్తున్నానని తెలిపారు. జైల్లో ఆయన నలిగిపోయారని, అప్పుడే ఆయనకు తాను ధైర్యం చెప్పానని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. అనంతరం పురంద్రీశ్వరి మాట్లాడుతూ అనూహ్యమైన విజయాన్ని సాధించామని తెలిపారు. ఎన్నికల సందర్భంగా మూడు పార్టీల మధ్య ఏర్పడిన సమన్వయం అమోఘమని అన్నారు. మూడు పార్టీల కార్యకర్తలు కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేశారన్నారు. విధ్వంసకరమైన, విద్శేషకరమైన పాలనను చూసిన ప్రజలు విసిగి వేసారి పోయి ఇంతటి ఘన విజయం తెచ్చి పెట్టామన్నారు. ఇంతటి ఘన విజయాన్ని మనం ఊహించలేదన్నారు. జగన్ అనే రాక్షసుడికి ఇంటికి పంపాలన్న కసితోనే పోలింగ్ కేంద్రాలకు తరలించారు.
అనేక పాఠాలు...
ఈ విజయం నుంచి అనేక పాఠాలు నేర్చుకోవాలని పురంద్రీశ్వరి అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోకుండా ఉంటే ఏం జరుగుతుందో ప్రజలు చేసిన హెచ్చరికగా భావించాలన్నారు. గెలిచామన్న ఆనందం కన్నా సుపరిపాలన అందించడంపైనే దృష్టి పెట్టాలన్నారు. మూడు పార్టీల కలయిక ఆలోచన ఒక్కటేనని అన్నారు. త్రివేణి సంగమంగా భావించాలన్నారు. నరేంద్ర మోదీ స్ఫూర్తి, చంద్రబాబు యుక్తి, పవన్ కల్యాణ్ శక్తి కలగలిపి ప్రజలకు జనరంజకమైన పాలనను అందించాలని కోరారు. కక్ష పూరిత రాజకీయాలకు చోటు తావివ్వకుండా, కార్యకర్తలను కూడా సంయమనం పాటించాలని కోరుతూ అందరు ప్రజలకు న్యాయం జరగేలా చూడాలని కోరారు. చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా తమ పార్టీ తరుపున సమరథిస్తుననానని తెలిపారు.
Next Story