Wed Apr 01 2026 16:16:01 GMT+0530 (India Standard Time)
TDP : చేరికలపై టీడీపీ స్టాండ్ ఇదేనట..నేతలకు నాయకత్వం ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ లో చేరికలపై డోర్స్ దాదాపు క్లోజ్ చేయాలని నిర్ణయించింది. వైసీపీ నుంచి చేరాలనుకునే నేతలకు అడ్డుకట్ట వేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొందరు నియోజకవర్గాల స్థాయిలో పార్టీలో చేరడంతో ఒరిజనల్ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని పార్టీ నాయకత్వం గుర్తించింది. సహజంగా అధికారంలో ఉన్న పార్టీలో చేరేందుకు ఎక్కువ మంది ఉత్సాహం చూపుతారని, కానీ వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని నియోజకవర్గ స్థాయి నేతలను పార్టీ నాయకత్వం హెచ్చరించింది.
ట్రాక్ రికార్డు చూసి...
తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్న నేతల ట్రాక్ రికార్డులను పరిశీలించాలని నాయకత్వం భావిస్తుంది. అయితే వారు అవసరాల కోసమే వస్తున్నారా? వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వస్తున్నారా? నిజంగా పార్టీ పట్ల ఆకర్షితులై వస్తున్నారా? అన్నది కూడా తెలుసుకోవాలని కండువా కప్పాలని నాయకత్వం స్పష్టమైన ఆదేశాలను నియోజకవర్గ స్థాయి నేతలను ఆదేశించింది. నేతలను చేర్చుకునే ముందు ఆచి తూచి వ్యవహరించాలని చెప్పింది. నేతలను చేర్చుకుంటే వచ్చే ప్రయోజనం కంటే నష్టమేనని నాయకత్వం భావిస్తుంది.
అవకాశవాదులను చేర్చుకుంటే...
అవకాశవాదులను ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేర్చుకంటే వారు కొనసాగుతారన్న గ్యారంటీ ఏమీ ఉండదని, అందుకే తొలి నుంచి పార్టీలో ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు, లోకేశ్ లు నియోజకవర్గాల స్థాయి నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కొందరు చేరడంతో కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకున్న వారికి ప్రాధాన్యం దక్కడం లేదని అన్నారు. నామినేటెడ్ పదవుల్లోనూ వలస వచ్చిన నేతలను పక్కన పెట్టాలని, సుదీర్ఘకాలం నుంచి పార్టీని అంటిపెట్టుకున్న వారి పేర్లనే సూచించాలని చెప్పింది. దీనివల్ల ద్వితీయ శ్రేణి నాయకులు వచ్చే ఎన్నికల్లో కష్టపడి పనిచేస్తారన్నారు. మొత్తం మీద చేరికలకు టీడీపీ దాదాపుగా బ్రేక్ వేసిందనే అనుకోవాలి.
Next Story

