Thu Mar 19 2026 03:32:42 GMT+0530 (India Standard Time)
యువగళం వచ్చే వారం నుంచే
చంద్రబాబును కుట్రపూరితంగానే కేసులో ఇరికించి అరెస్ట్ చేశారని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు

చంద్రబాబును కుట్రపూరితంగానే కేసులో ఇరికించి అరెస్ట్ చేశారని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. జైలులో చంద్రబాబును కలిసి వచ్చిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు తిరగబడి కొట్టే పరిస్థితి వచ్చిందన్నారు. తెలుగుదేశం పార్టీలో ప్రతి నాయకుడు చంద్రబాబేనని ఆయన అన్నారు. చంద్రబాబు అరెస్ట్తో పార్టీ క్యాడర్ ను మానసికంగా ఇబ్బంది పెట్టాలనుకుంటే అది కుదరని పని అని అచ్చెన్నాయుడు అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు.
సీఎం అవ్వడం ఖాయం...
ఏ సర్వే చూసినా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారనే తేలుతుందన్న అచ్చెన్నాయుడు రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు తథ్యమని చెప్పారు. అలాగే వచ్చే వారం నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమవుతుందని కూడా ఆయన ప్రకటించారు. అన్నీ అనుమతులు తీసుకున్న తర్వాతనే యువగళం పాదయాత్ర చేపడతామని చెప్పారు. యుగళం ఆపేసిన రాజోలు నియోజకవర్గం నుంచే పాదయాత్రను లోకేష్ ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. జనసేనతో కలసి ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టాలని నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జైలులో చంద్రబాబు భద్రతపై అనుమానాలున్నాయన్న అచ్చెన్న ఆయనకు ఏదైనా జరిగితే అందుకు జగన్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని వార్నింగ్ ఇచ్చారు.
Next Story

