Mon Mar 23 2026 14:04:08 GMT+0530 (India Standard Time)
TDP : టీడీపీ అగ్రనేతల మధ్య గ్యాప్.. కీచులాటలు... కుమ్ములాటలు
నెల్లూరు జిల్లాలో నేతల మధ్య ఆధిపత్య పోరు మొదలయింది.

నెల్లూరు జిల్లాలో నేతల మధ్య ఆధిపత్య పోరు మొదలయింది. మంత్రి నారాయణ, నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల మధ్య గ్యాప్ బాగానే వచ్చినట్లు కనిపిస్తుంది. చిన్న సమస్యను కూడా పెద్దదిగా చూస్తూ రెండు వర్గాలు పార్టీని ఇబ్బంది పెడుతున్నాయని కార్యకర్తలు అటున్నారు. చంద్రబాబు నాయుడుకు మంత్రి నారాయణ అత్యంత సన్నిహితుడు. అమరావతి రాజధాని నిర్మాణంలో ఆయనది నేటికీ కీలక పాత్ర. అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీ నుంచి వచ్చినప్పటికీ టీడీపీలో బలమైన నాయకుడిగా ఉన్నారు.
నేతల మధ్య విభేదాలతో...
అయితే వీరిద్దరి మధ్య ఏర్పడిన విభేదాలు ఇప్పుడు జిల్లా రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి. నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన కూటమి పార్టీలు ఇప్పుడు నేతల మధ్య విభేదాలతో తనకు తానే ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్థలం పక్కనే ఉన్న అక్రమ కట్టడానికి మంత్రి నారాయణ మున్సిపల్ మంత్రిగా శంకుస్థాపన చేయడమే దీనికి ప్రధాన కారణమని అంటున్నారు. వేమిరెడ్డి అభ్యంతరం చెప్పినా ప్లాన్ కు ఆమోదం తెలిపారని, దీనిపై వేమిరెడ్డి గుర్రుగా ఉన్నారని పార్టీ నేతలే చెబుతున్నారు. మరొకవైపు మంత్రి నారాయణ కూడా తన ఆధిపత్యాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రశాంతి రెడ్డికి విస్తరణలో...
దీంతో పాటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మంత్రి వర్గ విస్తరణలో అవకాశం లభిస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలోనూ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని అంటున్నారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి మంత్రి పదవి లభిస్తే తన ప్రాభవం నెల్లూరు జిల్లాలో తగ్గుతుందని నారాయణ కొంత భయపడుతున్నారని, అందుకే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని వేమిరెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. మరొకవైపు మంత్రి నారాయణ వర్గీయులు మాత్రం నిబంధనల మేరకే మున్సిపల్ శాఖ అధికారులు అనుమతి ఇచ్చారంటున్నారు. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో ఇద్దరు అగ్రనేతల మధ్య వివాదం ఇటు క్యాడర్ తో పాటు అటు అధికారులకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.
Next Story

