Sat Mar 07 2026 21:57:12 GMT+0530 (India Standard Time)
Chandrababu : జగన్ ను నమ్మొద్దండీ.. ఫేక్ ఫెలో : చంద్రబాబు
ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. తణుకులో జరిగిన రోడ్ షో లో ఆయన మాట్లాడారు.

రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. తణుకులో జరిగిన రోడ్ షో లో ఆయన మాట్లాడారు.కన్నెర్ర చేస్తే చిప్ప పట్టుకుని జగన్ ఎక్కడకు వెళతాడంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ప్రతి క్షణం అభివృద్ధి కోసం తపించామని తెలిపారు. పోలవరాన్ని 72 శాతం పూర్తి చేసిన బాధ్యత ఎన్డీఏ పార్టీలకే దక్కిందన్నారు. అమరావతిని నిర్మించి అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దాలని భావించామన్నారు. కానీ జగన్ వచ్చిన తర్వాత అమరావతిని నాశనం చేశారన్నారు. అభివృద్ధి కావాలా? విధ్వంసం కావాలా? సంక్షేమం కావాలా? అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు. సైకిల్ స్పీడ్ కు తిరుగులేదు, గ్లాసు జోరుకు ఎదురులేదన్నారు. తనకు అనుభవం ఉందని, పవన్ కు పవర్ ఉందని ఆయన అన్నారు.
జగన్ ను అధికారం నుంచి...
జగన్ ను అధికారం నుంచి దించడానికే మూడు పార్టీలు కలిశాయన్నారు. అగ్నికి ఆయువు తోడయినట్లు టీడీపీకి పవన్ తోడయ్యారన్నారు. వ్యక్తిగత దాడులను తట్టుకుని పవన్ రాజకీయాల్లో నిలబడ్డారన్నారు. ఏపీని కాపాడుకోవాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. అక్రమాలను ఎదుర్కొనేందుకు పవన్ ధైర్యంగా నిలబడ్డారన్నారు. మూడు పార్టీలు కలవడంతో వైసీీపీకి డిపాజిట్లు వస్తాయా? అని ప్రశ్నించారు. జనం జగన్ ను తరిమి కొడితేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఐదేళ్లు ప్రతిపక్ష పార్టీలను రోడ్డు మీదకు రాకుండా అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఒక అహంకారి విధ్వంసకర పాలనపై ధ్వజమెత్తింది తాను, పవన్ మాత్రమేనని అన్నారు.
అక్రమ కేసులు పెట్టి...
అక్రమ కేసులు పెట్టి పచ్చని రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన వైసీపీని భూస్థాపితం చేసే సమయం ఆసన్నమయిందన్నారు. మే 13న స్వేచ్ఛగా, ఆలోచించి ఓటేయాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. కులం, మతం, ప్రాంతం కాదు ముఖ్యం కాదని, మీరిచ్చే ఓటుతో తాడేపల్లి కోట బద్దలవ్వాలన్నారు. జగన్ ఒక ఫేక్ ఫెలో అని అన్నారు. తాను, పవన్ అన్యోన్యంగా ఉంటే సోషల్ మీడియాలో మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టిన వ్యక్తి జగన్ అని అన్నారు. పవన్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారన్నారు. ఫేక్ న్యూస్ నమ్మకుండా ఒకసారి చెక్ చేసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పరదాలు కట్టుకుని తిరిగిన జగన్ మళ్లీ వస్తున్నాడని, ఈసారి తరిమికొట్టాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. సూపర్ సిక్స్ లో మహిళలకు చోటు కల్పించామని తెలిపారు.
Next Story

