Fri Dec 05 2025 14:25:40 GMT+0000 (Coordinated Universal Time)
పెట్రోల్ బంక్ కోసం అన్న క్యాంటీన్ కూల్చివేత
అతి తక్కువ ధరకు పేదలకు అల్పాహారం, భోజనం అందించాలన్న ఉద్దేశంతో గత టిడిపి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా..

కడప : పెట్రోల్ బంక్ కోసం అన్న క్యాంటీన్ ను కూల్చివేశారు అధికారులు. ఈ ఘటన గత అర్థరాత్రి కడపలో జరగగా.. ఎంతోమంది కడుపు నింపిన అన్న క్యాంటీన్ కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. అతి తక్కువ ధరకు పేదలకు అల్పాహారం, భోజనం అందించాలన్న ఉద్దేశంతో గత టిడిపి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను నిర్మించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే కడపలో రూ.30 లక్షల వ్యయంతో అన్న క్యాంటీన్ ను నిర్మించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్ల నిర్వహణను పూర్తిగా ఆపివేయగా.. కరోనా సమయంలో ఆ క్యాంటీన్ ను కోవిడ్ సెంటర్ గా మార్చారు.
ఎలాంటి సమాచారం లేకుండా అన్న క్యాంటీన్ ను కూల్చివేయడంపై విమర్శలు వస్తున్నాయి. క్యాంటీన్ లో ఉన్న విలువైన వస్తువులను కూడా బయటకు తీయకుండా అలాగే కూల్చివేయడం పై ఆందోళన వ్యక్తమవుతోంది. విషయం తెలిసిన టిడిపి కడప నియోజకవర్గ బాధ్యుడు అమీర్ బాబు నేతృత్వంలో నేతలు ఆందోళనకు దిగారు. కూల్చివేసిన క్యాంటీన్ ప్రాంతంలో నగరపాలక సంస్థ పెట్రోలు బంకు ఏర్పాటు చేస్తున్నట్టు కమిషనర్ రంగస్వామి తెలిపారు. పెట్రోల్ బంక్ కట్టేందుకు నగరంలో చాలా ఖాళీ స్థలాలుండగా.. అన్న క్యాంటీన్ భవనాన్ని కూల్చడం దారుణమని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story

