Sun Mar 15 2026 12:43:46 GMT+0530 (India Standard Time)
దీక్షకు దిగిన జేసీ ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్షకు దిగారు. కౌన్సిలర్ ఇంటిపై దాడికి నిరసనగా ఆయన దీక్షకు దిగారు

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్షకు దిగారు. 30వ వార్డు కౌన్సిలర్ మల్లికార్జున ఇంటిపై జరిగిన దాడికి నిరసనగా ఆయన దీక్షకు దిగారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ దాడి చేయించారని ఆయన ఆరోపిస్తున్నారు. కౌన్సిలర్ ఇంటిపై దాడి చేసిన వారిని ఎందుకు అరెస్ట్ చేయరని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని మల్లికార్జున ఇంటిపైకి దాడి చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని తెలిపారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్షను విరమింప చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
అచ్చెన్న ఖండన...
తాడిపత్రిలో కౌన్సిలర్ దాడిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. ఈ దాడి అత్యంత హేయమని ఆయన అన్నారు. వైసీపీ గూండాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడి చేస్తారా? అంటూ అచ్చెన్న నిలదీశారు. ఇటీవల విజయకుమార్ పై నలుగురు కర్రలతో దాడి చేశారని, ఆ ఘటన మరవకముందే కౌన్సిలర్ మల్లికార్జున పైనా దాడి చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. దళితులపై ఈ ప్రభుత్వం కక్ష కట్టినట్లు వ్యవహరిస్తుందని ఆయన అన్నారు.
Next Story

