Fri Dec 05 2025 23:15:00 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుండి శ్రీశైలంలో స్పర్శదర్శనం నిలిపివేత
భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి గర్భాలయ అభిషేకాలు, స్పర్శదర్శనాలను నేటి నుండి నిలిపివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ..

ఈ నెల 23వ తేదీతో శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు ముగియనున్నాయి. కార్తీకమాసం ముగుస్తుండటంతో శ్రీశైల క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి గర్భాలయ అభిషేకాలు, స్పర్శదర్శనాలను నేటి నుండి నిలిపివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. సర్వదర్శనం క్యూలైన్ ద్వారా వచ్చే సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. స్వామివారి గర్భాలయ అభిషేకాలు నిర్వహించడం, స్పర్శ దర్శనానికి అనుమతించడం వల్ల సర్వదర్శనం క్యూలైన్లో ఉన్న భక్తులకు దర్శనానికి గంటల సమయం పడుతుందని.. అందుకే వాటిని తాత్కాలికంగా ఆపివేసినట్లు తెలిపారు.
కాగా.. శుక్రవారం రోజు స్పర్శదర్శనానికి ముందుగా ఆన్ లైన్ టికెట్లు పొందిన వారికి మాత్రం స్పర్శ దర్శనాన్ని కల్పిస్తున్నారు. శని,ఆది, సోమవారాల్లో కార్తీక మాసారంభానికి ముందే స్పర్శదర్శనం టికెట్లను ఆపివేశారు. ఈ నెల 23 వరకూ ఆ టికెట్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి, సహకరించాలని ఆలయ కమిటీ కోరింది.
Next Story

