Sun Mar 15 2026 23:12:45 GMT+0530 (India Standard Time)
వెధవ పనులన్నింటికీ అడ్డుపడ్డాననే?
సస్పెన్షన్ ఉత్తర్వులు తనకు అందలేదని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు

సస్పెన్షన్ ఉత్తర్వులు తనకు అందలేదని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. తాను సోషల్ మీడియాలోనే తన సస్పెన్షన్ ఉత్తర్వులు చూశానని ఆయన చమత్కరించారు. తనపై ఏసీబీ కేసుల ఉన్న మాట వాస్తవమేనని, ఒకటిన్నర సంవత్సర క్రితం కేసు రిజిస్టర్ చేసినా ఇంతవరకూ ఛార్జిషీట్ వేయలేదని పేర్కొన్నారు. ట్రయల్ మొదలు కాకుండా తాను సాక్షులను ఎలా ప్రభావితం చేస్తానని ఆయన ప్రశ్నించారు. ఎవరో తీసేసిన తాహసిల్దార్ సలహా మేరకు సస్పెండ్ చేసి ఉంటారని ఆయన ఎద్దేవా చేశారు.
మళ్లీ న్యాయపోరాటం..
ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై ఈడీ, సీబీఐ ఛార్జిషీట్ లు ఉన్నాయని, ఆమెకు వర్తించని నిబంధనలు తనకు ఎలా వర్తిస్తాయని ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. తనపై అక్రమంగా కేసు నమోదయిందన్నారు. రూపాయి అవినీతి జరగని చోట కేసు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. ఇజ్రాయిల్ కు రెండు లేఖలు రాసినా అవినీతి నిరోధక చట్టాలకు లోబడి పనిచేశామని వారు చెప్పారు. కొన్ని శక్తులు తనను టార్గెట్ చేస్తున్నాయన్నారు. కోడికత్తిని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని తగలబెట్టాలని చూస్తే తాను అడ్డుకున్నానని ఏబీ వివరించారు. వెధవ పనులన్నింటికీ అడ్డుకున్నందుకే తనను టార్గెట్ చేశారని ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. సస్పెండ్ చేస్తే మళ్లీ న్యాయపోరాటం చేస్తానని ఏబీ హెచ్చరించారు.
Next Story

