Fri Dec 05 2025 18:05:34 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ కళ్యాణ్ కు ఆ ఎన్నికలను గుర్తు చేసిన సజ్జల
సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఓడించడానికి ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాయని

వచ్చే ఎన్నికల కోసం మారీచ శక్తులు మళ్లీ ఏకమయ్యాయని.. సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఓడించడానికి ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి పవన్ కళ్యాణ్ ఎందుకు మద్దతివ్వలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఎందుకు చేతులు కలిపారో ప్రజలకు చెప్పాలని అన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు, కన్నీళ్లు చూశానని నారా లోకేశ్ అన్నారని, గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఇవి కనపడలేదా అని సజ్జల ప్రశ్నించారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారని చెప్పారు.
సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మేరుగ నాగార్జున, లక్ష్మీపార్వతి, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేశ్ తదితరులు పాల్గొన్నారు. తండ్రిని మించిన తనయుడిగా ముఖ్యమంత్రి జగన్ పాలన అందిస్తున్నారని.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని అన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించామని.. రైతు భరోసా కేంద్రాలు, ఆసుపత్రులు, గ్రామ సచివాలయాలు ఇలా అన్నింటినీ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
సీఎం జగన్ జన్మదిన వేడుకలను పలు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో వైసీపీ నాయకులు వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా భారీ కేకును కట్ చేసి కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పలు ప్రాంతాల్లో వైసీపీ నేతలు అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు.
Next Story

