Sat Dec 06 2025 02:07:54 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : అనాధ రక్షకా.. దర్శనం కష్టం.. ఆదాయం ఘనం
తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతుంది. బుధవారం కూడా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు

తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతుంది. బుధవారం కూడా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామి వారి దర్శనానికి గంటల సమయం పడుతుంది. గత కొద్ది రోజులుగా తిరుమలలో ఇదే పరిస్థితి ఉంది. వసతి గృహాలు దొరకక బయటే కొందరు భక్తులు తలదాచుకుంటున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
అన్ని కంపార్ట్మెంట్లలో..
ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. బయట కృష్ణ తేజ గెస్ట్హౌన్ వరకూ భక్తుల క్యూ లైన్ ఉంది. ఉచిత దర్శనానికి భక్తులకు ఇరవై గంటలకు పైగానే సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు అన్నప్రసాదాలను అందచేస్తూ వారికి ఇబ్బంది కలగకుండా చేస్తున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.41 కోట్ల రూపాయలు వచ్చింది. ఇటీవల కాలంలో అత్యధికంగా ఆదాయం వచ్చిన రోజు ఇదే కావడం గమనార్హం. నిన్న తిరుమల శ్రీవారిని 75,125 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 31, 140 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారని అధకిారులు తెలిపారు.
Next Story

