Wed Mar 18 2026 09:30:41 GMT+0530 (India Standard Time)
Tirumala : తిరుమలలో నేటి భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారమయినా భక్తుల రద్దీ తగ్గలేదు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారమయినా భక్తుల రద్దీ తగ్గలేదు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు సులువుగా దర్శనం కలిగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గకపోవడంతో వసతి గృహాల కొరత కూడా ఏర్పడనుంది. వసతి గృహాలు దొరకక భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. దర్శనం పూర్తయిన భక్తులు తమకు కేటాయించిన వసతి గృహాన్ని ఖాళీ చేయాలని కోరుతున్నారు.
అవసరమైన చర్యలు...
భక్తులు కొండకు రాక ఎక్కువ కావడంతో పాటు కొన్ని ముఖ్యమైన తేదీల్లో సిఫార్సు లేఖలను కూడా అనుమతించకూడదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నిర్ణయించారు. తిరుమలలో నిత్యాన్నదాన సత్రానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో అందరికీ భోజనం, టిఫిన్లు అందచేస్తున్నారు. ఇక లడ్డూ ప్రసాదాల తయారీ సంఖ్యను కూడా గత నెల నుంచి పెంచినట్లు అధికారులు తెలిపారు. మే నెల నుంచి భక్తుల రాక ఎక్కువ కావడంతో వారు అడిగిన లడ్డూలను విక్రయించేందుకు అవసరమైన తయారీకి టీటీడీ సిద్ధమయింది.
ఇరవై కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనానికి ఐదు గంటల సమయ పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 77,044 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,478 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.44 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

