Fri Dec 05 2025 19:37:13 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో నేటి రద్దీ.. పదమూడు కంపార్ట్ మెంట్లలో నిండిన భక్తులు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు తరలి వచ్చారు.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు తరలి వచ్చారు. వరస సెలవులు వస్తుండటంతో ఇక రేపటి నుంచి తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నట్లు ప్రకటించారు. భక్తులకు వసతి తో పాటు దర్శనం విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
వేసవి కాలంలో...
తిరుమలకు వేసవి కాలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వేసవి సెలవులు ఉండటంతో పాటు, పరీక్ష ఫలితాలు వస్తుండటంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా తిరుమలకు చేరుకుంటున్నారు. కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఎక్కువ మంది కాలినడకన వస్తామని మొక్కులు మొక్కుకోవడంతో అలిపిరి నుంచి శ్రీవారి పాదాల నుంచి అధిక శాతం మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. అటువంటి వారు అడవి జంతువుల బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పదమూడు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదమూడు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటలకుపైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 70,372 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,463 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.25 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

