Thu Apr 25 2024 16:30:07 GMT+0000 (Coordinated Universal Time)
రుయా ఘటనపై సీరియస్ అయిన ఏపీ ప్రభుత్వం.. వారిపై చర్యలు
తిరుపతిలోని రుయా ఆసుపత్రి అంబులెన్స్ ఘటనపై అధికారులను వివరణ కోరామని, విచారణకు ఆదేశించామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ..
తిరుపతి : రుయా ఆసుపత్రి వద్ద ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు సాగించిన దందాపై ఏపీ ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. తిరుపతి బాలాజీ జిల్లాకు చెందిన మంత్రి రోజా మాట్లాడుతూ.. ఈ ఘటనకు బాధ్యులుగా గుర్తిస్తూ ఆసుపత్రి సీఎస్ఆర్ఎంవోను సస్పెండ్ చేశామని రోజా ప్రకటించారు. అంతేకాకుండా ఆసుపత్రి సూపరింటెండెంట్కు షోకాజ్ నోటీసులు జారీ చేశామని ఆమె తెలిపారు. ఘటన జరిగిన వెంటనే తమ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్లు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతిలోని రుయా ఆసుపత్రి అంబులెన్స్ ఘటనపై అధికారులను వివరణ కోరామని, విచారణకు ఆదేశించామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ఈ ఘటన దురదృష్టకరమని, ఇలాంటి వ్యక్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. మహాప్రస్థానం అంబులెన్స్లు 24 గంటలూ పనిచేసేలా త్వరలోనే ఒక విధానాన్ని తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో మృతదేహాలను వీలైనంత వరకు మహాప్రస్థానం వాహనాల ద్వారానే ఉచితంగా తరలించేలా చర్యలు తీసుకుంటామని, అత్యవసర పరిస్థితుల్లో మృతుల కుటుంబసభ్యులే నిర్ణయం తీసుకునేలా చూస్తామన్నారు.
Next Story