Sun Mar 15 2026 18:02:06 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడటానికే ఆస్తుల వివాదం
వైఎస్ షర్మిల, వైఎస్ జగన్ ఆస్తుల వివాదంపై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు.

వైఎస్ షర్మిల, వైఎస్ జగన్ ఆస్తుల వివాదంపై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. ఇవి ఆస్తి తగాదాలు కాదని, అధికారం కోసం తగాదా అని ఆయన అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేత చంద్రబాబు నాయుడు కళ్లలో ఆనందం చూడటానికే వైెఎస్ షర్మిల ఈ వివాదం పై రోజూ మీడియా సమావేశాలు పెడుతున్నారని అన్నారు. ఆస్తి తగాదా అయితే పరిష్కరించుకోవచ్చని, కానీ షర్మిల ప్రెస్ మీట్లు పెట్టేది వైఎస్ జగన్ ను, వైసీపీని తిట్టడానికేనని విజయసాయిరెడ్డి అన్నారు.
ఆయన అజెండాను పట్టుకుని...
చంద్రబాబు అజెండాను వైఎస్ షర్మిల అమలు చేస్తుందన్నారు. మరోసారి జగన్ ను ముఖ్యమంత్రిగా చేయకుండా ఉండటానికి ఇప్పటి నుంచే కుట్ర జరుగుతుందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. జగన్ పట్ల మహిళల్లో వ్యతిరేకతను పెంచాలన్న కారణంతోనే వైఎస్ షర్మిలను చంద్రబాబు ఈ రకంగా ఆడుకుంటున్నారని ఆయన అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతికి ఎవరు కారకులో తెలియదా? అంటూ వైఎస్ షర్మిలను ప్రశ్నించారు. చంద్రబాబుతో కలసి జగన్ పై రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Next Story

