Wed Dec 17 2025 14:11:41 GMT+0000 (Coordinated Universal Time)
Weather Alert: దంచి కొడుతున్న వర్షాలు.. హెచ్చరికలు జారీ
సోమవారం పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని

భారత వాతావరణ విభాగం (IMD) సెప్టెంబర్ 9, సోమవారం పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రుతుపవనాల వర్షాల కారణంగా భారతదేశం అంతటా పలు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ అనౌన్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గత రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి ఉత్తరాంధ్ర ప్రాంతంలోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. మత్స్యకారులు గురువారం వరకు వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. విశాఖపట్నం, కళింగపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో మూడో నంబరు హెచ్చరికలు, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో ఒకటో నంబరు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.
సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. గంటకు గరిష్ఠంగా 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతున్నారు.
Next Story

