Sat Mar 07 2026 20:08:54 GMT+0530 (India Standard Time)
ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
రాష్ట్రానికి మేలు చేసే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మరోసారి ముఖ్యమంత్రి

రాష్ట్రానికి మేలు చేసే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మరోసారి ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 51వ పుట్టినరోజు సందర్భంగా అచ్చంపేట చౌత్రా సెంటర్ లో అభిమానులు, కార్యకర్తల సమక్షంలో వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే కేక్ కట్ చేసి.. సీఎం జగన్ కు జన్మదిన శుభకాంక్షలు తెలియజేశారు. .. ప్రజలకు మేలు జరగాలన్నా.. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలన్నా.. నియోజకవర్గంలో తనను, రాష్ట్రంలో సీఎం జగన్ ని మరోసారి గెలిపించాలని కోరారు. నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక నాయకుడు జగన్ అని అన్నారు. గత ప్రభుత్వాలు ప్రజలను మోసం చేసి దోచుకుంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం.. ప్రతి కుటుంబానికి సంక్షేమం అందిస్తూ అండగా నిలిచారన్నారు.
ఏడు దశాబ్దాల భారతదేశ చరిత్రలో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చి భావితరాలకు బంగారు బాట వేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిదేనని నంబూరు శంకరరావు గారు అన్నారు. క్రోసూరు జిల్లా పరిషత్ హైస్కూల్ లో 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ఉచిత ట్యాబులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. క్రోసూరు, బెల్లంకొండ, అచ్చంపేట మండలాలకు చెందిన 2199 మంది విద్యార్థులకు ఉచిత ట్యాబులు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యావ్యవస్థను పటిష్టం చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలలంటే పెచ్చులూడిపోయి శిథిలావస్థలో ఉంటాయని భావన నుంచి.. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా నిలబడే విద్యాలయాలను భావించే స్థాయికి సీఎం జగన్ చేర్చారన్నారు. నాడు నేడు ద్యారా లక్షలాది స్కూళ్లను దేవాలయాలుగా మార్చారన్నారు. పేదవారి చదువు కోసం మంచి పాలన అందిస్తున్న జగన్ మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. బెల్లంకొండ మండలానికి 299 ట్యాబులు, క్రోసూరు మండలానికి 686, అచ్చంపేట మండలానికి 585, అమరావతి మండలానికి 388, పెదకూరపాడు మండలానికి 241 ట్యాబులు అందజేశామన్నారు. నియోజకవర్గంలో 2199 మందికి రూ.7.25 కోట్ల విలువైన ట్యాబులు అందించినట్లు తెలిపారు.
మానవత్వమే మతం కావాలని, లౌకిక భారతదేశంలో అన్ని కులాలు, మతాలు ఒక్కటేనని నంబూరు శంకరరావు అన్నారు. అచ్చంపేట మండలం తాళ్లచెరువు ఎస్సీ కాలనీలో నిర్వహించిన సెమీక్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పాల్గొన్నారు. ప్రజల ఇంట సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఏ మతం అయినా విశ్వ శాంతినే కోరుతుందన్నారు. శాంతియుత సహజీవనమే క్రిస్మస్ సందేశం కాగా, సకల జనులు సంయమనంతో కలిసిమెలిసి ఉండాలన్న క్రీస్తు బోధనలు మానవాళికి ఆచరణీయమని అన్నారు.
Next Story

