Wed Jan 07 2026 02:40:15 GMT+0000 (Coordinated Universal Time)
రాజకీయ నేతలూ.. మా గ్రామానికి రావొద్దంటూ బోర్డు
ఆదోని నియోజకవర్గంలోని పెద్ద హరివాణం గ్రామస్తులు రాజకీయ నేతలకు హెచ్చరిక జారీ చేశారు

ఆదోని నియోజకవర్గంలోని పెద్ద హరివాణం గ్రామస్తులు రాజకీయ నేతలకు హెచ్చరిక జారీ చేశారు. ఏ రాజకీయ నాయకుడు తమ గ్రామానికి రావొదంటూ బోర్డు పెట్టారు. తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని పెద్ద హరివాణం గ్రామస్తుల నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా రిలే దీక్షలు నిర్వహిస్తున్న గ్రామస్తులు ప్రభుత్వం తమ గ్రామాన్ని మండల కేంద్రంగా చేయకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. కర్నూలు జిల్లా, ఆదోని -2 మండలంలోని పెద్ద హరివాణం గ్రామస్తులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించేంత వరకు ఏ రాజకీయ నాయకుడినీ గ్రామంలో అడుగు పెట్టనివ్వకూడదని గ్రామస్తులంతా తీర్మానించారు.
సరిహద్దుల్లోనే బోర్డును ఏర్పాటు చేసి...
ఈ మేరకు ఆదివారం గ్రామ సరిహద్దులో బోర్డును ఏర్పాటు చేసి తమ నిరసనను తెలియజేశారు. రాష్ట్రంలోనే అతిపెద్ద మండలమైన ఆదోని మండలాన్ని నాలుగు మండలాలుగా విభజించాలని గడిచిన ఏడాది నుంచి ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా పెద్ద హరివాణం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ గ్రామస్థులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయితే, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆదోని మండలాన్ని రెండు మండలాలుగా విభజిస్తూ ఆదోని, పెద్ద హరివాణం మండలాలుగా ప్రకటించింది. ఇందులో ఆదోని మండలంలో 24 గ్రామాలు, పెద్ద హరివాణం మండలంలో 22 గ్రామాలను కేటాయించింది.
నిరాహారదీక్షలు చేస్తూ...
అయితే 16 గ్రామాల ప్రజలు పెద్ద హరివాణం మండల కేంద్రంలో విలీనాన్ని వ్యతిరేకిస్తూ దీక్షలు చేయడంతో ప్రభుత్వం వెనకడుగు వేసి పెద్ద హరివాణం మండలం కాకుండా ఆదోని - 1, ఆదోనీ -2 మండలంగా ప్రకటించింది. ఈ నిర్ణయంపై పెద్ద హరివాణం గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గత వారం రోజులుగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఆందోళనలో భాగంగా ఆదివారం గ్రామానికి చెందిన పలువురు మండల కేంద్రం ఏర్పాటు కోసం నిరాహార దీక్ష చేపట్టారు. నాయకులు తమను, తమ గ్రామాన్ని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఏ పార్టీ రాజకీయ నాయకులు తమ గ్రామంలోకి రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు. తిరిగి మండల కేంద్రంగా ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని పేర్కొన్నారు
Next Story

