Tue Feb 03 2026 09:21:17 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan: పవన్ కల్యాణ్ వార్నింగ్.. నేతలలో ఇకనైనా కదలిక తెస్తుందా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నేతలపై ఆగ్రహం చెందడంలో తప్పులేదు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నేతలపై ఆగ్రహం చెందడంలో తప్పులేదు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమకు పట్టనట్లు వ్యవహరిస్తుండటం భవిష్యత్ లో ప్రమాదానికి దారి తీస్తుందని పవన్ కల్యాణ్ గుర్తించినట్లుంది. ప్రతి విషయంలో తాను రియాక్ట్ అవ్వడం తప్పించి పదవులు పొందిన వారు కూడా నోరు మెదపకుండా ఉండటం పార్టీ ఎదుగుదలకు ఎలా ఉపయోగపడుతుందని ఆయనలో తలెత్తిన సందేహం నిజమే. ఎందుకంటే కూటమిలో ఉన్న తాము ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తున్నప్పటికీ చివరకు పవన్ కల్యాణ్ పై విమర్శలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. పవన్ కల్యాణ్ ను మాత్రమే కాదు. కాపు సామాజికవర్గం విషయంలోనూ వస్తున్న విమర్శలకు జనసేన నేతలు సమాధానం చెప్పడం లేదు.
లడ్డూ విషయంలో ఏంటిది?
తిరుమల లడ్డూ విషయంలో జంతువుల కొవ్వు కలిసిందని, ఆ లడ్డూలు అయోధ్యకు కూడా పంపారంటూ పవన్ కల్యాణ్ సనాతన ధర్మం అంటూ యాగీ చేశారని, కనకదుర్గ గుడి మెట్లు కడిగారంటూ ఇటు వైసీపీ నేతలు, అటు సోషల్ మీడియాలో హోరెత్తి పోతున్నప్పటికీ జనసేన నేతలు మాత్రం పట్టించుకోకపోవడాన్ని ఆయన సీరియస్ గా తీసుకున్నారు. దీంతో పాటు పార్టీ కట్టుతప్పి ఎటు వెళుతుందోనన్న భయం పవన్ కల్యాణ్ లో వచ్చినట్లు కనపడుతుంది. ఎమ్మెల్యేలపై ఆరోపణలు ఒక ఎత్తైతే, అదే వివాహేతర సంబంధాలు కూడా జనసేనను రోడ్డు మీదకు ఈడుస్తున్నాయని పవన్ కల్యాణ్ సీనియర్ నేతల ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముద్రగడ పద్మనాభం రాసిన లేఖకు కూడా రియాక్ట్ కాకపోవడాన్ని పవన్ తప్పుపడుతున్నారు.
పదవులు ఇచ్చినా...
అందుకే పవన్ కల్యాణ్ సమావేశం నుంచి మధ్యలోనే బయటకు వెళ్లిపోయారంటున్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తో సహా ఎవరూ మాట్లాడకపోవడంపై ఆయన ఒకింత ఆగ్రహం చెందినట్లు తెలిసింది. జనసేన పార్టీని ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా తీసుకెళ్లాలని తాను భావిస్తుంటే దానికి విరుద్ధంగా జరుగుతున్న పరిణామాలు ఆయనను కలచి వేస్తున్నాయంటున్నారు. అందుకే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులున్నప్పటికీ, చివరకు తన సోదరుడు నాగబాబు చిన్న విషయాలకు కూడా సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతారని, కానీ దీనిపై స్పందించకపోవడాన్ని పవన్ కల్యాణ్ తప్పుపట్టారని అంటున్నారు. మొత్తం మీద పవన్ కల్యాణ్ పార్టీ నేతలపై అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. ఇలాగే కొనసాగితే కష్టమని ఆయన తేల్చేసి ఇంతటితో ముగింపు పలకాలా? అన్న వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.
Next Story

