Thu Mar 12 2026 16:01:12 GMT+0530 (India Standard Time)
సుప్రీంకోర్టుకు వెళ్లడం రాజకీయ ఎత్తుగడే
అమరావతి రాజధానిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పిందని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ తెలిపారు

అమరావతి రాజధానిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పిందని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ తెలిపారు. శాసనసభకు ఉన్న పరిమితులను తీర్పు చెప్పిందన్నారు. రాజధానిని మార్చే అధికారం శాసనసభకు లేదని, పార్లమెంటుకు మాత్రమే ఉందని చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఆరు నెలల తర్వాత హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లడమేంటని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల వరకూ ఇదే తంతును ఈ ప్రభుత్వం కొనసాగుతుందని తెలిపారు. సుప్రీంకోర్టులో ఎన్నికల వరకూ తీర్పు రాకుండా ఎత్తుగడలు వేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆయనకు అవగాహన ఉంది....
ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై సంపూర్ణమైన అవగాహన ఉందని తాను నమ్ముతున్నానని అన్నారు. ఓబులాపురం కేసులో ఆయనకు అవగాహన ఉందని చెప్పారు. ఉత్తరాంధ్రలో తాను చేసిన అవినీతితో జగన్ అడ్రస్ గల్లంతయిందని పయ్యావుల కేశవ్ తెలిపారు. ధర్మం రైతుల పక్షాన నిలుస్తుందని తాను నమ్ముతున్నానన్నారు. శానసనభలో బిల్లు ప్రవేశపెడతారని తాను అనుకోవడం లేదని పయ్యావుల అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ బాగుందని ముఖ్మమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.
Next Story

