Sat Dec 13 2025 22:25:55 GMT+0000 (Coordinated Universal Time)
వైభవంగా శ్రీవారికి పుష్పయాగం
కార్తీకమాసం సందర్భంగా తిరుమలలోని శ్రీవారి ఆలయంలో పుష్పయాగం వైభవంగా జరిగింది

కార్తీకమాసం సందర్భంగా తిరుమలలోని శ్రీవారి ఆలయంలో పుష్పయాగం వైభవంగా జరిగింది. ప్రతి కార్తీకమాసంలోని శ్రవణా నక్షత్రంలో ఈ పుష్పయాగాన్ని నిర్వహిస్తారు. ఈ యాగంలో పథ్నాలుగు రకాల పూలు, ఆరు రకాల పత్రాలతో స్వామివార్లకు పుష్పార్చన చేశారు. స్వామి అమ్మవార్లకు శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో గల కల్యాణ మండపంలో ఈ పుష్పయాగం జరిగింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఈ పుష్పయాగాన్ని నిర్వహించారు. ఉత్సవమూర్తులకు చేసిన ఈ పుష్పయాగం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ వేద పండితులతో పాటు అధికారులు కూడా పాల్గొన్నారు.
వంద కోట్లు దాటిన ఆదాయం...
తిరుమలలో గత కొద్ది రోజులుగా భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంది. వరసగా ఎనిమిదో నెల కూడా వంద కోట్ల రూపాయల ఆదాయాన్ని దాటిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. గత నెల హుండీ ద్వారా శ్రీవారికి 122.8 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. గత మార్చి నెల నుంచి వరసగా వంద కోట్ల రూపాయల ఆదాయాన్ని దాటుతుంది. గత జులై మాసంలో అత్యధికంగా 139.35 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.
Next Story

