Thu Jul 17 2025 00:50:43 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు
ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎన్డీఏ కూటమి ఖరారు చేసింది

ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎన్డీఏ కూటమి ఖరారు చేసింది. సి.రామచంద్రయ్యకు మరోసారి అవకాశం కల్పించింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శిగా ఉన్న హరిప్రసాద్ కు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయడంతో వీరిద్దరి ఎంపిక నామమాత్రమే. గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీలుగా ఎన్నికయిన సి.రామచంద్రయ్య, మహ్మద్ ఇక్బాల్ పై అనర్హత వేటు పడటంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ నెల 12వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నిక ఉప ఎన్నిక జరగనుంది. వీళ్లిద్దరూ ఈరోజు నామినేషన్లు వేయనున్నారు. శాసనసభలో ఉన్న బలాబలాలను దృష్ట్యా వీరి ఎన్నిక లాంఛనమే. ఏకగ్రీవంగా ఎన్నిక జరగనుంది.
రెండు స్థానాలకు...
సి. రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా రెండు సార్లు పనిచేశారు. కడప జిల్లాకు చెందిన సి.రామచంద్రయ్య తర్వాత ప్రజారాజ్యంలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో ఎమ్మెల్సీగా పనిచేశారు. తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత వైసీపీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికలకు ముందు తిరిగి టీడీపీలో చేరారు. హరిప్రసాద్ మీడియా రంగంలో సేవలందించారు. ఈనాడు, ఈటీవీలలో పనిచేశారు. తర్వాత మాటీవీ న్యూస్ హెడ్ గా పనిచేశారు. అనంతరం సీవీఆర్ న్యూస్ ఛానల్స్ లో పనిచేశారు. అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రాజకీయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
Next Story