Sat Mar 07 2026 22:18:10 GMT+0530 (India Standard Time)
బెజవాడలో పడగవిప్పుతున్న కాల్ మనీ వేధింపులు
వాంబే కాలనీకి చెందిన ఫణికుమార్ కుటుంబం తమ షాపు నిర్వహణ కోసం ధన శేఖర్ నుంచి నాలుగేళ్ల క్రితం 50 వేల రూపాయలు..

విజయవాడలో కాల్ మనీ నాగులు పడగవిప్పుతున్నాయి. గతంలో కాల్ మనీ వేధింపులు భరించలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఈ వ్యవహారం పెద్దదుమారమే రేపింది. అధికవడ్డీలకు డబ్బును అప్పుగా ఇచ్చి.. ముక్కుపిండి వసూలు చేస్తున్న కాల్ మనీ నాగులపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో పరిస్థితి చక్కబడింది. మళ్లీ ఇప్పుడు అదే వ్యవహారం మొదలైంది. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలకు డబ్బు అప్పు ఇచ్చి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన నగరంలోని వాంబే కాలనీలో వెలుగుచూసింది.
వాంబే కాలనీకి చెందిన ఫణికుమార్ కుటుంబం తమ షాపు నిర్వహణ కోసం ధన శేఖర్ నుంచి నాలుగేళ్ల క్రితం 50 వేల రూపాయలు అప్పు తీసుకుంది. మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించారు. మొత్తం రెండు లక్షలు కట్టినా.. మరో లక్ష కడితేనే ప్రామిసరీ నోటు తిరిగి ఇస్తానని ఫణికుమార్ కుటుంబాన్ని ధనశేఖర్ బెదిరించాడు. ధనశేఖర్ వేధింపులు తట్టుకోలేక ఆ కుటుంబం నున్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు రంగంలోకి దిగి వడ్డీవ్యాపారి ధనశేఖర్ ను అరెస్ట్ చేసి, రిమాండ్ కు పంపారు.
తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుతీసుకున్న వారిని ఎవరైనా వడ్డీ పేరుతో వేధిస్తే నిర్భయంలో పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ కొల్లు శ్రీనివాసరావు వెల్లడిచారు. అధికవడ్డీల పేరుతో వేధించే వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Next Story

